Pegasus: పెగసెస్ స్పైవేర్ అంశం దేశ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై కేంద్రం సమాధానం చెప్పాలంటూ విపక్షాలు పట్టుబట్టాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయిన నాటి నుండి విపక్షాలు పెగసెస్ పై సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేస్తూ సభా వ్యవహారాలకు అంతరాయం కల్గిస్తున్నాయి. దీంతో పెగసెస్ స్పైవేర్ నిఘా వ్యవహారంపై ఎట్టకేలకు కేంద్రం స్పందించింది. ఆ స్పైవేర్ తయారీ సంస్థ, ఇజ్రాయిల్ కు చెందిన ఎన్ఎస్వో గ్రూపుతో తాము ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదని కేంద్ర రక్షణ శాఖ నేడు రాజ్యసభలో కీలక ప్రకటన చేసింది.
ఎన్ఎస్వో గ్రూపు టెక్నాలజీతో రక్షణ శాఖకు ఏమైనా వ్యాపార లావాదేవీలు ఉన్నాయా, ఒక వేళ ఉంటే వాటి వివరాలు చెప్పాలంటూ సీపీఎం ఎంపి వి శివదాసన్ రాజ్యసభలో ప్రశ్నించారు. దీనిపై రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. ఎన్ఎస్వో గ్రూపుతో రక్షణ శాఖ ఎలాంటి లావాదేవీలు జరపలేదని లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు.
ఈ సంస్థ అభివృద్ధి చేసిన పెగాసస్ స్పైవేర్ తో భారత్ సహా పలు దేశాల ప్రముఖుల ఫోన్ లపై నిఘా పెట్టినట్లు ఇటీవల అంతర్జాతీయ మీడియాలో సంచలన కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ స్పైవేర్ నిఘా జాబితాలో భారత్ కు చెందిన దాదాపు 300 మంది ఉన్నారని కథనాలు పేర్కొన్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా పలువురు రాజకీయ ప్రముఖులు, జర్నలిస్ట్ లు, సీబీఐ అధికారులు, హక్కుల కార్యకర్తల ఫోన్ లు హ్యాక్ చేసినట్లు కథనాలు వచ్చాయి. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభానికి ముందు జూలై 18న ఈ కథనాలు వెలువడటంతో ఈ అంశంపై ప్రతిపక్షాలు ఉభయ సభల్లో చర్చకు పట్టుబడుతూ ఆందోళనలు చేస్తున్నాయి. విపక్షాల ఆందోళన నేపథ్యంలో ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది.