Corona Vaccination: నూరు శాతం కోవిడ్ వ్యాక్సినేషన్ లక్ష్యంగా ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఆంక్షలను సడలించడంతో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. అన్ని రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగవంతంగా జరుగుతోంది. దేశంలో చాలా రాష్ట్రాల్లో నిత్యం పదులు, వందల సంఖ్యలో కేసులు నమోదు అవుతునే ఉన్నాయి. కేరళలో మాత్రం కేసుల సంఖ్య అధికంగా ఉంది. గడచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 21వేలకు పైగా కొత్త కేసులు నమోదు అయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో 44 కేసులు నమోదు వచ్చాయి. ప్రస్తుత పండుగ సీజన్ లో కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలనీ, దసరా శరన్నవరాత్రి వేడుకల్లో కోవిడ్ నిబంధనలు పాటించాలని పాలకులు సూచిస్తున్నారు. కరోనా వ్యాప్తి నివారణకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గం కావడంతో నూరు శాతం వ్యాక్సినేషన్ కు ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి.
Corona Vaccination: వ్యాక్సిన్ వేయించుకోకపోతే ఆఫీసులోకి నో ఎంట్రీ
ఈ క్రమంలోనే ఢిల్లీ సర్కార్ ఓ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోని ప్రభుత్వ ఉద్యోగులను ఇకపై ఆఫీసులకు రానివ్వకూడదని ఢిల్లీ సర్కార్ నిర్ణయించింది. కనీసం ఒక్క డోసు వ్యాక్సిన్ కూడా తీసుకోని వాళ్లు ఆక్టోబర్ 16 నుండి ఆఫీసులకు రావద్దని సర్కార్ తెగిసి చెప్పింది. ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్), ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్ మెంట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్ పర్సన్ విజయ్ దేవ్ ఆదేశాలు జారీ చేశారు. వ్యాక్సిన్ వేసుకోని ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లను సెలవులో ఉన్నట్లు పరిగణిస్తామని ఈ ఆదేశాల్లో ప్రభుత్వం పేర్కొంది. కార్యాలయాలకు వచ్చే ప్రభుత్వ ఉద్యోగులను ఆరోగ్య సేతు యాప్ లో వ్యాక్సిన్ సర్టిఫికెట్ పరిశీలించి మాత్రమే అనుమతించాలని అన్ని శాఖల ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఇదే విధంగా మార్గదర్శకాలను కేంద్రం అమలు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ నెల 15 లోగా ఒక్క డోసు అయినా వేసుకోవాలి
ప్రభుత్వంలోని అన్ని శాఖల ఉద్యోగులు, టీచర్లు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికీ అక్టోబర్ 15వ తేదీలోగా నూరు శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని గత నెల 29న జరిగిన ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రజలతో ఎక్కువగా కాంటాక్ట్ అయ్యే శాఖల్లోని ఉద్యోగులకు ముందుగా కనీసం ఒక డోస్ అయినా వ్యాక్సిన్ వేయాలని ఆ సమావేశంలో నిర్ణయించి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో మొదటి డోస్ కూడా పూర్తి కాని వారిని అక్టోబర్ 16వ తేదీ నుండి కార్యాలయాలకు అనుమతించకూడదనీ, వ్యాక్సిన్ వేయించుకునే వరకూ లీవ్ లో పంపాలని ఉత్తర్వులో పేర్కొన్నారు.