బీజేపీ మాజీ ఎంపీ సుబ్రమణ్యస్వామికి ఢిల్లీ హైకోర్టు షాకింగ్ ఉత్తర్వులు ఇచ్చింది. ఢిల్లీలో ఆయన నివాసం ఉంటున్న ప్రభుత్వ గృహాన్ని ఆరు వారాల్లో ఖాళీ చేయాలని కోర్టు ఆదేశించింది. భద్రతాపరమైన ముప్పు కారణంగా ఆయనకు 2016లో ప్రభుత్వ నివాసాన్ని కేటాయించారు, రాజ్యసభ ఎంపీ అయిన ఆయన పదవీ కాలం ఈ ఏడాది ఏప్రిల్ లో ముగిసింది. దీంతో బంగ్లాను ఇతర ఎంపీలకు కేటాయించాల్సి ఉన్నందున ఆయన ఖాళీ చేయాలని కోర్టు సూచించింది. అయిదేళ్ల కాలపరిమితి ముగియడంతో మరి కొంత కాలం తనకు గడువు ఇవ్వాలని స్వామి కోరారు. అయితే గడువు పొడిగించలేమని కేంద్రం తెలిపింది.
హోం మంత్రిత్వ శాఖ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ సంజయ్ జైన్ కోర్టులో వాదనలు వినిపించారు. వసతి గడువు ను పొడిగించాలని ప్రభుత్వం అనుకోవడం లేదని, నిజాముద్దీన్ ఈస్ట్ లోని ఆయన (స్వామి) నివాసంలో సెక్యూరిటీ ఇవ్వగలమని చెప్పారు. కేంద్ర మంత్రులు, న్యాయమూర్తులకు అకామిడేషన్ అవసరం ఉందని సంజయ్ జైన్ కోర్టుకు విన్నవించారు. ప్రభుత్వ వాదనలు విన్న కోర్టు ఆరు వారాల్లోగా ప్రభుత్వ నివాసాన్ని ఖాళీ చేయాలని ఆదేశించింది. ప్రభుత్వం ఆయనకు జడ్ కేటగిరి భద్రత కల్పిస్తొంది.
కాగా ఢిల్లీ హైకోర్టు తీర్పుపై స్వామి స్పందించారు. బంగ్లా ఖాళీ చేయడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు సుబ్రమణ్యస్వామి. తాను ఎంపీ కాకముందే భద్రతా కారణాల దృష్ట్యా 2016లో తనకు జడ్ ప్లస్ కేటరిగి తో ఢిల్లీలో బంగ్లా కేటాయించారని పేర్కొన్నారు. ఆ తర్వాత తాను ఎంపీ అయ్యాక అదే బంగ్లాలో నివాసం ఉంటున్నట్లు తెలిపారు. పాత ఒప్పందం మళ్లీ కొనసాగుతుందా అని భద్రతా అధికారులకు లేఖ రాశాననీ, ఆ విషయంపైనే తాను కోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు. కానీ కేంద్రం తనకు బంగ్లా కేటాయించలేమని చెప్పిందని పేర్కొన్నారు. అందులో ఇబ్బంది ఏమీ లేదనీ, తాను బంగ్లా ఖాళీ చేస్తానని స్వామి స్పష్టం చేశారు.
అమరావతి అసైన్డ్ భూముల స్కామ్ కేసు.. ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి నారాయణకు బిగ్ రిలీఫ్