ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ డిప్యూటి సీఎం మనీశ్ సిసోడియాకు ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. లిక్కర్ స్కామ్ కేసులో మనీశ్ సిసోడియాకు బెయిల్ మంజూరు చేయడం కుదరదని తేల్చి చెప్పేసింది. మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్ ను జస్టిస్ దినేశ్ కుమార్ శర్మ సింగిల్ బెంచ్ తిరస్కరించింది. ఈ మేరకు మంగళవారం జస్టిస్ దినేశ్ కుమార్ శర్మ తీర్పును వెల్లడించారు. మనీశ్ సిసోడియా బెయిల్ పై విడుదల అయితే ఆయనకు ఉన్న పలుగుబడితో సాక్షులను ప్రభావితం చేయగలరని హైకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. లిక్కర్ స్కామ్ కేసులో మనీశ్ పై ఉన్న ఆరోపణలు తీవ్రమైనవి అని తెలిపింది.
మనీశ్ సిసోడియాకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరించడంతో ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించే అవకాశాలు ఉన్నట్లు ఆమ్ అద్మీ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ కేసులో సిసోడియాను ఈ ఏడాది ఫిబ్రవరి 26న సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హజరు పర్చగా, తొలుత సీబీఐ కస్టడీకి అప్పగించగా విచారణ జరిపారు. అనంతరం జ్యూడీషియల్ కస్టడీ విధించడంతో మనీశ్ సిసోడియాను తీహార్ జైలుకు తరలించారు. మరో పక్క ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు సిసోడియా జ్యూడీషియల్ కస్టడీని జూన్ 1వ తేదీ వరకూ పొడిగించింది.