దేశ రాజధాని ఢిల్లీలో వరుసగా మూడు సార్లు అధికారం సాధించి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న అమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో నిత్యం సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. బీజేపీ దేశ వ్యాప్తంగా బలమైన శక్తిగా ఎదిగినా ఢిల్లీలో ఆప్ హవాను అడ్డుకోలేకపోతున్నది. ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లోనూ ఆప్ హవానే కొనసాగింది. రాజకీయంగా హవా కొనసాగిస్తున్నా ఆప్ కు వరుసగా తలనొప్పులు, ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి.
తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ గా ఉన్న కేజ్రీవాల్ కు రూ.164 కోట్ల రికవరీ నోటీసులు అందాయి. ఈ మేరకు ఢిల్లీ డైరెక్టరేట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ విభాగం నోటీసులు జారీ చేసింది. పది రోజుల్లోగా రూ.164 కోట్లు తిరిగి చెల్లించాలని నోటీసులో పేర్కొంది. ప్రభుత్వ ప్రకటనల పేరుతో అమ్ ఆద్మీ పార్టీకి ప్రచారం చేసుకున్నారన్న ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమర్ సక్సెనా.. ఆప్ నుండి నగదు వసూలు చేయాలని ఢిల్లీ సీఎస్ ను ఆదేశించారు. సీఎస్ ఆదేశాల మేరకు డైరెక్టరేట్ ఆఫ్ ఇన్పర్మేషన్ అండ్ పబ్లిసిటీ విభాగం .. ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ కు నోటీసులు జారీ చేసింది.
2015 -2016 మధ్య కాలంలో ప్రభుత్వ ప్రకటనల ముసుగులో ప్రచురితమైన రాజకీయ ప్రకటనల కోసం ఆప్ నుండి రూ.97 కోట్లను రికవరీ చేయాలని ఢిల్లీ ఎల్జీ వినయ్ కుమార్ సక్సేనా ఆదేశాలు జారీ చేసిన కొద్ది రోజులకే ఈ నోటీసు వచ్చింది. ఈ నోటీసులపై ఆప్ స్పందించింది ఢిల్లీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు బీజేపీ ఈ వ్యూహాలను ఉపయోగిస్తొందని ఆరోపించింది ఆప్. ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాల్లో ప్రకటనలు జారీ చేస్తున్నప్పుడు వారిని ఎందుకు లక్ష్యంగా చేసుకోవడం లేదని ప్రశ్నించింది.