ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ హైకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కు ఢిల్లీ హైకోర్టు ఇవేళ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలతో ఈడీ అధికారులు ఇప్పటికే పలువురుని అరెస్టు చేసింది. ఈ కేసులో అరెస్టు అయిన బినోయ్ బాబు బెయిల్ పిటిషన్ కు సంబంధించి హైకోర్టు ఈడికి నోటీసులు జారీ చేసింది. ఫెర్నోడ్ రికార్డు అనే లిక్కర్ కంపెనీలో బినోయ్ జనరల్ మేనేజర్ గా పని చేసే వారు. అయితే ఆయనను లిక్కర్ స్కామ్ కు సంబంధించి గత ఏడాది నవంబర్ నెలలో ఈడీ అరెస్టు చేసింది. ఫిబ్రవరి 16వ తేదీన ఢిల్లీ ట్రయల్ కోర్టు బినోయ్ బాబు సహా ఇతర నిందితులందరి బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది. వీళ్లు తీవ్ర ఆర్ధిక నేరానికి పాల్పడినట్లు, కేసు తీవ్రత దృష్ట్యా ఈ దశలో బెయిల్ మంజూరు చేయడం కుదరని పేర్కొంది.
దీంతో బినోయ్ .. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ దినేష్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టగా, బినోయ్ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. మద్యం పాలసీ విధానంలో బినోయ్ ఎలాంటి పాత్ర పోషించలేదనీ, పైగా సీబీఐ ఆయనను ప్రత్యక్ష సాక్షిగా మాత్రమే పేర్కొన్న విషయాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. దురుద్దేశపూర్వకంగానే ఈడీ బీనోయ్ పై అభియోగాలు నమోదు చేసిందని న్యాయవాది రోహత్గి వాదనలు వినిపించారు. దీంతో స్పందించాల్సిందిగా ఈడీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మరోవైపు ఈడీ సైతం తమ అభియోగాలను బలపర్చే సాక్షాలు ఉన్నట్లుగా కోర్టుకు విన్నవించింది. ఈ పిటిషన్ పై తదుపరి విచారణను మార్చి 16వ తేదీకి వాయిదా వేసింది కోర్టు.