దేశంలో మంకీ పాక్స్ కేసుల పెరుగుదల ఆందోళన కల్గిస్తొంది. తాజాగా భారత్ లో నాల్గవ కేసు ఢిల్లీలో నమోదు అయ్యింది. ఢిల్లీకి చెందిన 31 ఏళ్ల యువకుడికి మంకీ పాక్స్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. కేరళలో ఇప్పటి వరకూ మూడు మంకీ పాక్స్ కేసులు నమోదైయ్యాయి. విదేశాల నుండి వచ్చిన ముగ్గురు మంకీ పాక్స్ సోకిన వారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు కేరళ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. అయితే ఇక్కడ తాజాగా ఢిల్లీలో నమోదైన కేసులో ట్విస్ట్ ఏమిటంటే.. అతనికి ఎటువంటి ట్రావెల్ హిస్టరీ లేదు. ఎటువంటి విదేశీ ట్రావెల్ హిస్టరీ లేని వ్యక్తికి మంకీ పాక్స్ సోకడం ఆందోళన కల్గిస్తొంది. జ్వరం, శరీరంపై పొక్కులు రావడంతో బాధితుడు.. వైద్యులను సంప్రదించాడు. పరీక్షలు నిర్వహించగా మంకీ పాక్స్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో ప్రస్తుతం అతడికి మౌలానా ఆజాద్ మెడికల్ కళాశాలలో చికిత్స అందిస్తున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా 16వేల మంది మంకీ పాక్స్ బారినపడ్డారు. ఈ వ్యాధి మొత్తం 75 దేశాలకు వ్యాపించింది. మరో వైపు మంకీ పాక్స్ కేసులు పలు దేశాలకు వేగంగా విస్తరిస్తుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రమత్తమైంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రజా ఆరోగ్య అత్యవసర పరిస్థితిని విధించింది. విదేశాల నుండి వచ్చే ప్రయాణీకులకు పరీక్షలు నిర్వహించి వారికి ఆ లక్షణాలు కనబడితే వెంటనే ఐసోలేషన్ కు తరలించాలని సూచించింది. కరోనా తరహాలో మంకీ పాక్స్ ప్రపంచానికి ముప్పు ఏర్పడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.