ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ (ఎంసీడీ) ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఢిల్లీ అధికార అమ్ ఆద్మీ పార్టీ (ఆప్), బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్లు ఫలితాలు కనబడుతున్నాయి. కౌంటింగ్ లో రెండు పార్టీలు సమాన సంఖ్యలో అధిక్యాన్ని చూపుతున్నాయి. ఈ నెల 4న మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలు జరిగాయి. మొత్తం 250 వార్డులు ఉన్న ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ లో పోలింగ్ 50 శాతం మాత్రమే నమోదు అయ్యింది. మొత్తం 1,349 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోటీ జరిగినప్పటికీ ప్రధాన పోటీ మాత్రం ఆప్, బీజేపీ మధ్య జరిగింది.
2017లో జరిగిన ఎన్నికల్లో అప్పట్లో ఉన్న 270 స్థానాలకు గాను 181 స్థానాల్లో బీజేపీ విజయం సాధించగా, ఆప్ 48 స్థానాలతో రెండో స్థానంలో నిలిచింది. కాంగ్రెస్ 30 స్థానాలతో మూడో స్థానానికి పరిమితం అయ్యింది. మున్సిపల్ పీఠం 15 ఏళ్లుగా బీజేపీ చేతిలో ఉంది, అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల్లో విజయం సాధిస్తూ వస్తున్న ఆప్ ఈ సారి మున్సిపల్ పీఠాన్ని కైవశం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మున్సిపల్ పీఠం చేజారిపోకుండా ఉండాలన్న పట్టుదలతో బీజేపీ సర్వశక్తులను ఒడ్డింది. ఈ ఎన్నికల్లో ఆప్ విజయం ఖాయమంటూ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా, ప్రస్తుతం అందుతున్న సమచారం మేరకు ఆప్ 123, బీజేపీ 117 స్థానాల్లోనూ, కాంగ్రెస్ తొమ్మిది వార్డుల్లోనూ అధిక్యత కొనసాగుతోంది. బీజేపీ, ఆప్ హోరా హోరీ కనబడుతోంది.
మరో పక్క తమ పార్టీ 180 వార్డులు గెలుస్తుందని ఆప్ ఎమ్మెల్యే సౌరఖ్ భరద్వాజ్ ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీ నుంచే మేయర్ ఎన్నికవుతారని ఆయన తెలిపారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలే నిజం కాబోతున్నాయని ఆయన పేర్కొన్నారు.