ఓ వైపు ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీని నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ విచారిస్తున్న సమయంలో నేడు కాంగ్రెస్ పార్టీ నేతలు ధరల పెరుగుదల, జీఎస్టీ, సోనియాను ఈడీ ప్రశ్నించడంపై ఢిల్లీలో నిరసన కార్యక్రమాలను చేపట్టారు. రాహుల్ గాంధీ సహా పార్టీ ఎంపీలు ఆందోళనలో పాల్గొన్నారు. పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం నుండి విజయ్ చౌక్ వరకూ నిరసన ప్రదర్శన జరిపారు. విజయ చౌక్ వద్ద రాహుల్ గాంధీ రోడ్డుపై భైటాయించగా పోలీసులు చుట్టుముట్టారు. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది, పోలీసులు రాహుల్ గాంధీని అరెస్టు చేశారు. ఆయనను మోసుకెళ్లి పోలీస్ వ్యాన్ ఎక్కించారు. అంతకు ముందు కాంగ్రెస్ నేతలు రంజీత్ రంజన్, కేసి వేణుగోపాల్, మాణిక్యం ఠాగూర్, ఇమ్రాన్ ప్రతాప్ గర్హి, కే సురేష్ తదితరులను పోలీసు వ్యాన్ ఎక్కించి కింగ్స్ వే క్యాంపుకు తరలించారు.
అరెస్టుకు ముందు రాహుల్ గాంధీ మాట్లాడుతూ కాంగ్రెస్ ఎంపీలంతా ఇక్కడే ఉన్నారనీ, ద్రవ్యోల్బణం, నిరుద్యోగంపై మాట్లాడేందుకు ప్రయత్నిస్తుంటే కనీసం భైటాయించేందుకు కూడా పోలీసులు అనుమతించడం లేదని అన్నారు. అక్కడ పార్లమెంట్ లో చర్చకు అనుమతించడం లేదని, ఇక్కడ అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము రాష్ట్రపతి భవన్ కు వెళ్లి వినతి పత్రం ఇవ్వాలనుకున్నట్లు చెప్పారు. ప్రజల సమస్యలపై దళం వినిపిస్తుంటే మోడీ ఓ రాజాలా వ్యవహరిస్తున్నారనీ, దేశంలో పోలీస్ రాజ్యం నడుస్తోందని రాహుల్ విమర్శించారు. రాహుల్ గాంధీ అరెస్టుపై కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ వేదికగా స్పందించింది. గతంలో ఇందిరా గాంధీ ఇలాగే రోడ్డుపై భైటాయించి ఆందోళన చేసిన ఫోటోను, ప్రస్తుతం రాహుల్ గాంధీ రోడ్డుపై భైటాయించిన ఫోటోను పక్కపక్కన పెట్టి .. చరిత్ర పునరావృత్తం అంటూ క్యాప్షన్ పెట్టింది. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.