ఇటీవల కాలంలో ఫేక్ బెదిరింపు కాల్స్ ఎక్కువ అవుతున్నాయి. ఫైట్స్, రైల్వే స్టేషన్ లో బాంబు ఉందంటూ ఫేక్ కాల్స్ రావడం దానిపై పోలీసులు, డాగ్ స్క్వాడ్ లు విస్తృతంగా తనిఖీలు చేయడం, ఆ తరువాత ఏమీ లేకపోవడంతో ఊరిపిపీల్చుకుంటున్న సందర్భాలు ఉన్నాయి. ఈ ఫేక్ కాల్స్ వల్ల ముందుగా ఆయా ప్రాంతాల వారు ఆందోళనకు గురి అవుతుంటారు. తాజాగా బుధవారం నాడు ఢిల్లీలోని ఓ ప్రముఖ పాఠశాలకు బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలాన్ని రేపింది. మథురా రోడ్డులోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కు ఈ మెయిల్ వచ్చింది. పాఠశాల ఆవరణలో బాంబులు ఉన్నాయంటూ అందులో పేర్కొనడంతో పాఠశాల యాజమాన్యం అప్రమత్తమైంది.
సిబ్బంది, విద్యార్ధులను అక్కడ నుండి బయటకు పంపించింది. వెంటనే ఈ సమాచారాన్ని పోలీసులకు తెలియజేశారు. పోలీసులు, బాంబు స్క్వాడ్ హుటాహుటిన అక్కడకు చేరుకుని తనిఖీలు చేపట్టగా, ఎలాంటి పేలుడు పదార్ధాలు కనిపించలేదు. పాఠశాల ఆవరణలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించగా ఎలాంటి పేలుడు పదార్ధాలు లభ్యం కాలేదని డిప్యూటి పోలీస్ కమిషనర్ రాజేష్ డియో తెలిపారు. దీంతో ఇది ఫేక్ మెయిల్ గా గుర్తించారు. ఆ మెయిల్ ఎక్కడి నుండి వచ్చింది అనే దానిపై పోలీసులు ఆరా తీశారు. అమెరికాలోని ఓ సర్వర్ నుండి ఈ మెయిల్ వచ్చిందనీ, ఈ ఇమెయిల్ పంపిన వారిని గుర్తించేందుకు సమయం పడుతుందని డీసీపీ తెలిపారు. ఆరు నెలల కాలంలో ఈ స్కూల్ కు బెదిరింపు కాల్ రావడం ఇది రెండో సారి.
YS Viveka Murder Case: అవినాష్ రెడ్డి పిటిషన్ పై విచారణ వాయిదా