Deve Gowda: మాజీ ప్రధాన మంత్రి దేవగౌడకు బెంగళూరులోని ఎనిమిదో సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టు భారీ షాక్ ఇచ్చింది. నైస్ సంస్థ దాఖలు చేసిన పరువునష్టం దావా కేసులో దేవగౌడ రూ.2 కోట్లు చెల్లించాలని కోర్టు నేడు తీర్పు ఇచ్చింది.
విషయం ఏమిటంటే.. బీదర్ సౌత్ మాజీ ఎమ్మెల్యే అశోక్ ఖేనీ ఎండిగా వ్యవహరిస్తున్న నంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కారిడార్ ఎంటర్ ప్రైజెస్ (నైస్) సంస్థ గురించి పదేళ్ల క్రితం దేవగౌడ విమర్శించారు. నైస్ ఒక దోపిడీ ప్రాజెక్టు అని వ్యాఖ్యానించారు. 2011 జూన్ నెలలో ఓ ఇంటర్వ్యూలో దేవగౌడ ఆ సంస్థపై తీవ్ర ఆరోపణలు చేశారు. గౌడర గర్జనే పేరుతే ఓ వార్తా ఛానల్ ఆ ఇంటర్వ్యును ప్రసారం చేసింది.
అయితే ఈ వ్యాఖ్యలపై సదరు సంస్థ దేవగౌడపై పరువు నష్టం దావా వేసింది. దేవగౌడ వ్యాఖ్యల వల్ల తమకు సంస్థ పరువు నష్టం కల్గిందని కోర్టును ఆశ్రయించింది. ఈ దావాపై సుదీర్ఘ విచారణ జరిపిన న్యాయస్థానం నేడు తీర్పును వెల్లడించింది.