DK Sivakumar: కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుపుతోంది. సీఎం కుర్చీ ఆశిస్తున్న ఇద్దరు నేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ లలో ఎవరిని ఎంపిక చేయాలి అన్నదానిపే పార్టీ పెద్దలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ విషయంపై ఢిల్లీలో జరుగుతున్న చర్చల కోసం సిద్దా రామయ్య, డీకే శివకుమార్ లు చేరుకున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసానికి పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేరుకుని చర్చలు జరుపుతున్నారు. ఖర్గే నివాసానికే సిద్దా రామయ్య, డీకే శివకుమార్ ను పిలిపించినట్లు తెలుస్తొంది. ఇవే సాయంత్రానికి సీఎం అభ్యర్ధి ఎవరు అనేది ఫైనల్ కావచ్చని వార్తలు వినబడుతున్నాయి.
ఈ సందర్భంగా డీకే శివకుమార్ ఇవేళ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన, కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి పదవిని చెరో రెండున్నర సంవత్సరాలు పంచుకోవాలన్న ప్రతిపాదనపై డీకే స్పందిస్తూ.. తాతల ఆస్తులను అన్నదమ్ములు పంచుకోవడం సహజమే కానీ సీఎం సీటు అలా వారసత్వంగా వచ్చిన ఆస్తి కాదనీ, దానిని పంచుకోలేమని అన్నారు. అలాగే ఉప ముఖ్యమంత్రి పదవిని మీరు అంగీకరిస్తారా? అన్న ప్రశ్నకు ఇప్పటి వరకైతే ఎలాంటి చర్చ జరగలేదని పేర్కొన్నారు. సిద్ధ రామయ్యతో రాజీపడినట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. కర్ణాటకలో పార్టీని అధికారంలోకి తీసుకొస్తానని కాంగ్రెస్ మాజీ చీఫ్ సోనియా గాంధీకి, జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ప్రామిస్ చేశానని డీకే చెప్పారు. వారికి ఇచ్చిన మాటను తాను నిలబెట్టుకున్నానని, ఇప్పుడు ఏం చేయాలనేది నిర్ణయించాల్సింది వారేనని అన్నారు శివకుమార్.
సిద్ధరామయ్యకు మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లుగా జరుగుతున్న ప్రచారంను ఖండించారు డీకే శివకుమార్. అసలు ఈ నంబర్ల గొడవేమిటని అన్నారు. పార్టీలో ఒకే ఒక నంబర్ ఉందని, అది తాము గెలిచిన 135 స్థానాలు అని వివరించారు. వచ్చే ఏడాది జరగనున్న లోక్ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చూస్తే సీఎం పదవికి సిద్ధరామయ్యే బెటర్ అన్న వాదనను డీకే శివకుమార్ తప్పుబట్టారు. వాళ్లు అలా కలలు కంటే కననివ్వండి.. వారి కలలను ఆపడానికి తానెవరినని అన్నారు. కర్ణాటక ప్రజలకు మంచి పాలన అందించాలన్నదే తన కల అని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను మరింత పెంచాలని, మారుమూల ప్రాంతాల్లోనూ కాంగ్రెస్ పార్టీని విస్తరించాలని తాను కలలు కంటున్నానని చెప్పారు డీకే. సీఎం పదవి విషయంలో ఇప్పటి వరకు చర్చలు జరగలేదని, దీనిపై ఢిల్లీలోనే చర్చిస్తామని తెలిపారు డీకే శివకుమార్.
Breaking: అవినాష్ రెడ్డి విజ్ఞప్తిని సీబీఐ స్పందన ఇదీ ..