DRDO 2DG Medicine: కోవిడ్ బాధితుల చికిత్స కోసం భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఒ) రూపొందించిన 2 డీజీ ఔషదాన్ని ఇటీవల కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే. త్వరలో మార్కెట్ లో అందుబాటులోకి రానున్న ఈ ఔషద వినియోగంపై డీఆర్డీఒ నేడు మార్గదర్శకాలను విడుదల చేసింది. వైద్యుల పర్యవేక్షణలోనే ఈ మందు ఇవ్వాలని సూచించింది. 2 డీజీ మందును గర్భిణీలు, పాలిచ్చే తల్లులకు ఇవ్వకూడదని డీఆర్డీఒ స్పష్టం చేసింది.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగులకు అనుబంధ చికిత్సగా 2 డీజీ ఔషదాన్ని ఉపయోగించడానికి అత్యవసర అనుమతి ఇచ్చింది. మథ్యస్తం నుండి తీవ్ర లక్షణాలతో బాధపడుతున్న కరోనా రోగులకు సాధ్యమైనంత త్వరగా అంటే పది రోజుల లోపు వైద్యులు ఈ ఔషదాన్ని సూచించాలి.
నియంత్రణ లేని డయాబిటిస్, తీవ్రమైన గుండె సంబంధిత సమస్యలు, అక్యుట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్, కాలేయ సంబంధిత వ్యాధులతో బాధపడే వారిపై ఈ మందును ఇంకా పరీక్షించలేదు. కావున అలాంటి వారి విషయంలో ముందు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. గర్బిణీలు, పాలిచ్చే తల్లులు, 18 సంవత్సరాల లోపు వారికి 2 డీజీ మందు ఇవ్వవద్దని స్పష్టం చేసింది.
కరోనా చికిత్సలో 2 డీజీ మందు వినియోగానికి ఇటీవల కేంద్రం అత్యవసర అనుమతులు ఇచ్చింది. పొడి రూపంలో (సాచెట్) లభించి ఈ మందును నీళ్లలో కలుపుకుని తాగడం ద్వారా వైరస్ ను నియంత్రించవచ్చని డీఆర్డీఒ ఇప్పటికే ప్రకటించింది. ఒక్కో సాచెట్ ధర రూ.990లుగా ఇటీవల డాక్టర్ రెడ్డీస్ ప్రకటించింది. 2 డీజీ సాచెట్ కోసం రోగులు, వైద్య సిబ్బంది డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ను సంప్రదించవచ్చని డీఆర్డీఒ తెలిపింది.