Drone farming: వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించు కోవడం ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాదించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కూలీల కొరత కారణంగా వ్యవసాయంలో యంత్రాలను వినియోగిస్తున్న విషయం తెలిసిందే. వరి కోత యంత్రాలను చాలా ప్రదేశాలలో వినియోగిస్తున్నారు. మన దేశంలో ఇతర ప్రాంతాలను పోల్చుకుంటే వ్యవసాయంలో గుజరాత్ రైతులు ఎక్కువ ప్రయోగాలు చేస్తున్నారు. అక్కడి రైతులు పూర్తిగా సేంద్రీయ వ్యవసాయం చేస్తుంటారు. కొన్ని ప్రాంతాల్లో అరుదైన పంటలను పండిస్తున్నారు.
గుజరాత్ రాష్ట్రం బనస్కాంత జిల్లా దీశాకి చెందిన రైతు కన్వర్జీ ఠాగూర్ ఓ అడుగు ముందుకు వేసి తన కూరగాయల పంటలపై డ్రోన్లతో పురుగు మందుల్ని పిచికారి చేస్తున్నాడు. దీని వల్ల సమయం ఆదా అవ్వడంతో పాటు నీటి వినియోగం తక్కువ అవుతుంది. కూలీల ఖర్చు లేకుండా పోతుంది. ప్రధానంగా ఈ జిల్లాలో నీటి కొరత ఎక్కువగా ఉండటం వల్ల పంటలపై పురుగు మందు పిచికారి రైతులకు పెద్ద సమస్యగా మారింది. పురుగు మందు పిచికారీ చేసే సమయంలో ఆ మందు రైతులు పీల్చడం వల్ల ఒక్కో సారి అనారోగ్యానికి గురవుతుంటారు. ఈ నేపథ్యంలో దీశాలోని రణపూర్ గ్రామానికి చెందిన రైతు కన్వర్జీ ఠాగూర్ చేసేన ఈ ప్రయోగం మంచి ఫలితాన్ని ఇచ్చింది. డ్రోన్ లకు సంబంధించి వీడియోలు చూసిన అతను వీటి ద్వారా పురుగు మందు పిచికారి చేస్తే ఎలా ఉంటుందని అలోచన చేశాడు.
ఆ ప్రయత్నంలో అతను సక్సెస్ అయ్యాడు. డ్రోన్లతో చాలా తక్కువ ఖర్చుకే పురుగుమందు పిచికారి పూర్తి అవుతోందని ఠాగూర్ తెలిపారు. మిగతా రైతులు కూడా ఈ విధమైన టెక్నాలజీని ఉపయోగించుకునేందుకు ముందుకు వస్తున్నారు. ఠాగూర్ ప్రయోగం గురించి జిల్లా వ్యాప్తంగా తెలియడంతో అనేక మంది రైతులు దీన్ని చూస్తున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మేల్యే కూడా ఠూగూర్ పొలాన్ని సందర్శించి పురుగు మందుల పిచికారిలో డ్రోన్ ఎలా పని చేస్తుందో చూసి తెలుసుకున్నారు. ఇతర ప్రాంత రైతాంగం కూడా ఈ టెక్నాలజీ వినియోగించుకునేందుకు ప్రభుత్వ పరంగా కూడా చేసే ప్రయత్నాలు ప్రారంభిస్తానని ఈ సందర్భంగా ఆయన రైతులకు హామీ ఇచ్చారు.