దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నకిలీ ఓట్లు ఉన్న సంగతి తెలిసిందే. అధార్ అనుసంధానం లేకపోవడం, ఒకే ఓటరు రెండు మూడు ప్రదేశాల్లో ఓటరుగా నమోదు అయి ఉండటంతో పెద్ద ఎత్తున ఉన్న డ్యూప్లికేషన్ ఓట్ల తొలగింపునకు ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఈ క్రమంలో భాగంగా దేశ వ్యాప్తంగా ఎన్నికల జాబితా నుండి పెద్ద ఎత్తున ఉన్న నకిలీ పేర్లను ఏరి పారేశారు. ఒకే పేరు, ఒకే పోటోతో ఒకటికి మించి ఉన్న వాటిని ఓటరు జాబితా నుండి తొలగించారు. గడచిన ఏడు నెలల్లో ఇలా మొత్తం కోటి మంది పేర్లు తొలగించడం లేదా సరిదిద్దడం చేసినట్లుగా ఎన్నికల కమిషన్ ప్రకటించింది. గత కొంత కాలంగా ఎన్నికల కమిషన్ ఓటర్ల సమగ్ర డిజిటల్ జాబితాపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా నకిలీల ఏరివేతను ప్రాధాన్యత అంశంగా తీసుకుని చర్యలు చేపట్టింది.
దేశ వ్యాప్తంగా ఓటర్ల ను వారి ఆధార్ తో స్వచ్చందంగా అనుసంధానించుకునేందుకు ఎన్నికల కమిషన్ అనుమతించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో 11,91,191 ఓట్లు ఒకే పేరుతో ఒకటికి మించి ఉన్నట్లుగా ఎన్నికల కమిషన్ గుర్తించింది. వీటిని పరిశీలించిన తర్వాత 9,27,853 ఓటర్ల పేర్లను తొలగించింది. అయితే బూత్ స్థాయిలో దృవీకరణ చేసిన తర్వాతనే జాబితా నుండి పేర్లను తొలగించినట్లు, స్వచ్చందంగా తొలగించలేదని ఎన్నికల కమిషన్ అధికారులు వెల్లడించారు. ఒక ఫోటోలు ఒకే రీతిలో ఉన్న 3,18,89,422 ఓటర్లను గుర్తించగా, తనిఖీ చేసిన తర్వాత 98,00,412 ఓట్లను తొలగించినట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది.