Breaking: ఢిల్లీ మద్యం పాలసీ స్కామ్ లో ఈడీ దూకుడు పెంచింది. మనీలాండరింగ్ దర్యాప్తులో నిందితుడైన సమీర్ మహేంద్రుడిని ఈ రోజు ఢిల్లీలో ఈడీ అరెస్టు చేసింది. సమీర్ మహేంద్రుడు ప్రస్తుతం ఢిల్లీ లోని జోర్ బాగ్ కు చెందిన మద్యం పంపిణీ సంస్థ ఇండో స్పిరిట్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ముంబాయికి చెందిన ఓన్లీ మచ్ లౌడర్ మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఇఓ) విజయ్ నాయర్ ను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) మంగళవారం అరెస్టు చేయగా, మరుసటి రోజే ఈడీ .. సమీర్ మహేంద్రుడిని అరెస్టు చేయడం విశేషం.
ఢిల్లీ మద్యం పాలసీ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ ఉద్యోగుల్లో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, అప్పటి ఎక్సైజ్ కమిషనర్ అర్వా గోపీ కృష్ణ, డిప్యూటి కమిషనర్ అరవింద్ తివారీ, అసిస్టెంట్ కమిషనర్ పంకజ్ భట్నాగర్ ఉన్నారు. ఇతర నిందితులు మనోజ్ రాయ్, అనున్ దీప్ ధాల్, అమిత్ అరోరా, అరుణ్ రామచంద్ర పిళ్లై, అర్జున్ పాండే తదితరులు ఉన్నారు. నిన్న సీబీఐ అరెస్టు చేసిన విజయ్ నాయర్ డిప్యూటి సీఎం సిసోడియా కు సన్నిహితుడు. ఈ పరిణామాలు బీజేపీ, ఆప్ మధ్య తీవ్ర ఘర్షణలకు దారి తీస్తున్నాయి. ఇదంతా ఆప్ ను ఎదుర్కొనలేక బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకుని చేస్తున్న కుటిలయత్నమని ఆప్ మండిపడుతోంది.
ఢిల్లీ నూతన ఎక్సైజ్ పాలసీలో కొన్ని లోపాలు ఉన్నాయనీ, టెండర్ల జారీ తర్వాత మద్యం లైసెన్సుదారులకు అనుచిత లబ్ది చేకూరేలా దీన్ని తయారు చేశారని ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) గతంలో ఎల్ జీ వినయ్ కుమార్ సక్సేనాకు ఓ నివేదిక ఇచ్చారు. ఈ నివేదిక ఆధారంగా ఆ ఎక్సైజ్ పాలసీపై దర్యాప్తు జరపాలని సీబీఐకి ఎల్ జీ సక్సేనా గతంలో సిఫార్సు చేశారు. దాంతో మద్యం లైసెన్సు ల మంజూరులో అవతకవకలకు పాల్పడినట్లు అభియోగాలతో కేసు నమోదు చేసిన సీబీఐ.. సిసోడియాను నిందితుడిగా చేర్చింది. మరోవైపు విపక్షాల నుండి విమర్శలు వచ్చిన నేపథ్యంలో గత నవంబర్ నెలలో ఆప్ సర్కార్ నూతన ఎక్సైజ్ పాలసీని వెనక్కు తీసుకుంది.