Loan App Case: లంచం..లంచం..లంచం..భారతదేశాన్ని పట్టి పీడిస్తోంది. అవినీతి జబ్బు దాదాపుగా అన్ని శాఖల్లోనూ పెనవేసుకుని పోయింది. లంచం ద్వారా ఏ స్థాయి అధికారిని అయినా మేనేజ్ చేయవచ్చనేది అక్రమార్కుల స్ట్రాటజీ. ఏ శాఖలో చూసుకున్నా కొందరు అవినీతి అధికారులు కనబడుతూనే ఉంటారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఏ శాఖలో చూసుకున్నా అవినీతి పరులు కనబడుతూనే ఉన్నారు. తమ శాఖలో ఒక్కరు కూడా అవినీతి పరులు లేరు అని చెప్పే అధికారులు లేరు. అవినీతి జాఢ్యం అంతగా పెరిగిపోయింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)లోనే గతంలో ఇద్దరు అధికారులు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలతో ఫిర్యాదులు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. తాజాగా ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)లోని ఒ అధికారి అవినీతి బాగోతం బట్టబయలు అయ్యింది. ఈడీ అధికారే లంచం తీసుకున్నారని వెలుగులోకి రావడం, సీబీఐ అధికారులు ఆ అధికారిపై కేసు నమోదు చేయడం తీవ్ర సంచలనం అయ్యింది.
విషయం ఏమిటంటే…రెండు తెలుగు రాష్ట్రాల్లో కొద్ది నెలల క్రితం రుణ యాప్స్ దురాగతాలు వెలుగుచూసిన సంగతి సంగతి తెలిసిందే. ఆ కేసుల్లో భాగంగా రుణ యాప్ సంస్థల బ్యాంకు ఖాతాలను దర్యాప్తు అధికారులు స్తంబింపజేశారు. ఆర్థిక నేరాలకు సంబంధించిన విషయం కావడంతో ఈ కేసులపై ఈడీ కూడా దృష్టి సారించింది. ఈడీ కూడా కేసు నమోదు చేసి వారిపై చర్యలు తీసుకుంటుంది సీసీఎస్ అధికారులు అనుకున్నారు. అయితే స్తంభింపజేసిన బ్యాంక్ అకౌంట్ల నుండి నగదు డ్రా చేసినట్లు తెలియడంతో సీసీఎస్ అధికారులకు అనుమానం వచ్చింది. దీనిపై వారు ఆరా తీయగా ముంబాయికి చెందిన అపోలో పిన్ వెస్ట్ లోన్ యాప్ సంస్థ ఎండీ నుండి ఈడీ అధికారి లలిత్ బజార్డ్ రూ.5 లక్షలు లంచం తీసుకున్నట్లు గుర్తించారు.
రుణ యాప్ కేసులో సీసీఎస్ అధికారులు స్తంభింపజేసిన బ్యాంకు ఖాతాలను తెరిపించేందుకు లంచం తీసుకున్నారనీ, ఆ క్రమంలోనే ఈడీ అధికారి లలిత్ పలు బ్యాంకులకు తప్పుడు పత్రాల ఇచ్చి ఖాతాలను తెరిపించి, డబ్బులు విడుదల చేయించినట్లు తెలుసుకున్నారు. దీంతో ఈ అవినీతి ఈడీ అధికారిపై సీబీఐకి సీసీఎస్ పోలీసులు సమాచారం అందించారు.
సీబీఐ అధికారులు రంగ ప్రవేశం చేసి విచారణ చేయగా బెంగళూరులోని పలు బ్యాంకు ఖాతా నుండి లావాదేవీలు జరిగినట్లు నిర్ధారణ అయ్యింది. దీనిలో ఈడి అధికారి లలిత్ బజార్డ్ పాత్ర ఉన్నట్లు గుర్తించిన సీబీఐ బెంగళూరులో కేసు నమోదు చేసింది.