ED Summons Sonia Gandhi, Rahul: కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం సమన్లు జారీ చేసింది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని నేషనల్ హెరాల్డ్ వ్యవహారానికి సంబంధించిన విచారణ జరుపుతున్నామనీ, ఈ కేసులో రేపు (గురువారం) తమ ముందు విచారణకు హజరు కావాలని రాహుల్ గాంధీని ఈడీ ఆదేశించింది. అదే విధంగా ఈ నెల 8వ తేదీన తమ ముందు విచారణకు హజరుకావాలని సోనియా గాంధీని ఆ సంస్థ కోరింది. ఈ విచారణకు సోనియా గాంధీ హాజరై అన్ని వివరాలు అందిస్తారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే ఈడీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు నోటీసులు ఇవ్వడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. ప్రజా వ్యతిరేక ఉద్యమ స్వరాన్ని అణచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తొందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. మోడీ పెంపుడు సంస్థగా ఈడీ పని చేస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సుర్జీవాలా ఘాటుగా విమర్శించారు. ఇద్దరు ప్రముఖ నేతలకు నోటీసులు ఇవ్వడాన్ని పిరికిపంద చర్యగా ఆయన అభివర్ణించారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ED Summons Sonia Gandhi, Rahul: కేసు ఏమిటి అంటే..?
నేషనల్ హెరాల్డ్ పత్రిక కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గతంలో నడిచింది. ప్రస్తుతం ఈ పత్రికను పార్టీ మూసేసింది. అయితే ఈ సంస్థకు దేశ రాజధాని ఢిల్లీ సహా పలు ఇతర ప్రాంతాల్లో అత్యంత విలువైన ఆస్తులు ఉన్నాయి. కాంగ్రెస్ కు నేషనల్ హెరాల్డ్ పత్రిక బకాయి ఉన్న రూ.90.25 కోట్లను వసూలు చేసుకునే హక్కును పొందేందుకు యంగ్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ ద్వారా నేరపూరితమైన కుట్ర పన్నారని బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి గతంలో ఆరోపించారు. ఇందుకు సంబంధించి సోనియా గాంధీ, రాహుల్ సహా ఏడుగురిపై ఢిల్లీలోని అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో స్వామి పిటిషన్ దాఖలు చేశారు. కేవలం రూ.50లక్షల చెల్లింపుతో ఆ హక్కును పొందేందుకు వారు యత్నించారని పిటిషన్ లో స్వామి ఆరోపించారు. ఈ కేసు విచారణలో భాగంగా ఇటీవలే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, పవన్ బన్సల్ ను ఈడీ విచారించింది. ఇప్పుడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను విచారించేందుకు ఈడీ నోటీసులు జారీ చేసింది.