రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకూ భారత్ జోడో యాత్ర చేస్తున్న తరుణంలో గోవాలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. చైనా భూ ఆక్రమణలపై మోడికి రాహుల్ గాంధీ ప్రశ్నలు సంధించిన రోజే గోవా కాంగ్రెస్ లో సంక్షోభం నెలకొంది. మాజీ ముఖ్యమంత్రి దిగంబర్ కామత్, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత మైఖేల్ లోబోతో సహా ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బుధవారం బీజేపీలో చేరారు. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ వీరికి కాషాయం కండువాలు కప్పి పార్టీకి ఆహ్వానించారు. దిగంబర్ కామత్, మైఖేల్ లోబోల నేతృత్వంలో ఎమ్మెల్యేలు రాజేష్ పాల్దేశాయ్, కేదార్ నాయక్, సంకల్ప్ ఆమోంకర్, అలెక్సో సిక్వేరా, రుడాల్ఫ్ ఫెర్నాండెజ్ లు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా మైఖేల్ లోబో మాట్లాడుతూ ప్రధాన మంత్రి మోడీ, సీఎం ప్రమోద్ సావంత్ లను బలోపేతం చేసేందుకు టూ థర్డ్ మెజార్టీతో బీజేపీలో విలీనం చేశామని పేర్కొన్నారు. కాంగ్రెస్ చోడో, బీజేపీ కో జోడో అంటూ వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. భారత్ జోడో అంటూ కాంగ్రెస్ యాత్ర ప్రారంభించింది కానీ గోవాలో కాంగ్రెస్ చోడో కార్యక్రమం ప్రారంభమైందని అన్నారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు ఆ పార్టీని వీడి బీజేపీలో చేరుతున్నారని సావంత్ వ్యాఖ్యానించారు. తొలుత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎం సావంత్, అసెంబ్లీ స్పీకర్ తో సమావేశమైయ్యారు. కాంగ్రెస్ శాసనసభాపక్షాన్ని బీజేపీలో విలీనం చేయాలని తీర్మానించారు. ప్రతిపక్ష నేత మైఖేల్ లోబో ఈ తీర్మానాన్ని ప్రతిపాదించగా, మాజీ సీఎం దిగంభర్ కామత్ బలపర్చారు. మిగిలిన ఎమ్మెల్యేలు ఆమోదించారు. అనంతరం సీఎం ప్రమోద్ సావంత్ తో కలిసి ఫోటోలు దిగారు. వీటిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో వైరల్ అయ్యాయి.
గోవాలో ఈ ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 40 స్థానాలు ఉన్న గోవా అసెంబ్లీలో బీజేపీ 20 స్థానాలు కైవశం చేసుకుంది. మ్యాజిక్ మార్క్ కు ఒక్క స్థానం తగ్గిన నేపథ్యంలో మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది బీజేపీ. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 11 స్థానాల్లో విజయం సాధించింది. ఇప్పుడు వారిలో ఎనిమిది మంది బీజేపీలో చేరిపోయారు. కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడతారు అంటూ రెండు నెలల క్రితమే వార్తలు వచ్చాయి. గోవా అసెంబ్లీ సమావేశానికి ఒక రోజు ముందు కాంగ్రెస్ పార్టీ సమావేశం ఏర్పాటు చేయగా, ఎడుగురు ఎమ్మెల్యేలు గైర్హజరయ్యారు. దాంతో వీరు బీజేపీ లో చేరనున్నారంటూ వార్తలు రాగా, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అదేశాల మేరకు సీనియర్ నేత ముకుల్ వాస్నిగ్ రంగంలోకి దిగి ఆ నేతలతో సంప్రదింపులు జరపడంతో సంక్షోభాన్ని సద్దుమణిగేలా చేశారు. గతంలో వచ్చిన ఊహాగానాలను నిజం చేస్తూ నేడు 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ పరిణామంతో కాంగ్రెస్ పార్టీ ఖంగుతిన్నది.
Read More: రాష్ట్ర విభజన సమస్యలపై 27న కీలక భేటీ .. కేంద్ర హోంశాఖ రూపొందిన అజండా ఇది.. ట్విస్ట్ ఏమిటంటే..?