Covid 19: మాజీ ప్రధాన మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ నేడు కరోనా బారిన పడ్డారు. ఆయనకు జ్వరం రావడంతో పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు.
మన్మోహన్ సింగ్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. మన్మోహన్ సింగ్ ఇప్పటికే రెండు డోసుల కరోనా టీకా వెయించుకున్నారు. మొదటి డోసు మార్చి నాల్గవ తేదీన, రెండవ డోసు ఈ నెల 3న తీసుకున్నారు.
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ వేగవంతం చేసేందుకు నిన్ననే కేంద్ర ప్రభుత్వానికి మన్మోహన్ సింగ్ పలు కీలక సూచనలు చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఈ మేరకు లేఖ రాస్తూ వ్యాక్సిన్ ఎంత మందికి ఇచ్చామనేది కాకుండా జనాభాలో ఎంత శాతం మందికి ఇచ్చామన్నదే పరిగణలోకి తీసుకోవాలని మోడీకి సూచించారు. మన్మోహన్ సింగ్ సూచనలు చేసిన 24 గంటల వ్యవధిలోని కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా 18 సంవత్సరాలు పైబడి వారందరూ మే 1 నుండి వ్యాక్సిన్ తీసుకోవచ్చని తెలియజేయడం గమనార్హం.
కాగా మన్మోహన్ సింగ్ కరోనా బారిన పడటంపై పలువురు రాజకీయ ప్రముఖులు స్పందించారు. త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్లు చేస్తున్నారు. ప్రధాన మంత్రి మోడీ, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.