ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర రాజస్థాన్ లో కొనసాగుతోంది. సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుండి రాహుల్ చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర ఇప్పటి వరకూ తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పూర్తి అయ్యింది. భారత్ జోడో యాత్రలో రాహుల్ వెంట పార్టీ నేతలు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. రాహుల్ పాదయాత్ర ఆ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతోంది. అనేక మంది ప్రముఖులు, సినీ సెలబ్రెటీలు, మాజీ అధికారులు హక్కుల కార్యకర్తలు పాదయాత్రలో రాహుల్ గాంధీకి సంఘీ భావం తెలియజేస్తూ ఆయనతో కలిసి కొద్దిదూరం నడక సాగిస్తున్నారు. తాజాగా భారత్ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ బుధవారం భారత్ జోడో యాత్రలో రాహుల్ తో కలిసి నడిచారు.
రాజస్థాన్ లోని సవాయి మాధోపూర్ కు చెందిన భఢితి నుండి బుధవారం ఉదయం రాహుల్ పాదయాత్ర ప్రారంభమైంది. ట్విట్టర్ లో విడుదల అయిన వీడియోలో ఆర్బీఐ మాజీ గవర్నర్ రాజన్, రాహుల్ గాంధీ, సచిన్ పైలట్ తో కలిసి నడుస్తూ కనిపించారు. రాహుల్ తో నడుస్తూనే పలు అంశాలను చర్చించారు రాజన్. గతంలో ఎన్డీఏ సర్కార్ నోట్ల రద్దును కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించిన సందర్భంలో రఘురామ్ రాజన్ కూడా మద్దతు ఇచ్చిన విషయం విదితమే. రాజన్ కూడా పలు మార్లు ఈ నోట్ల రద్దుపై బహిరంగంగానే విమర్శలు చేశారు. ఇలాంటి నిర్ణయాలు వల్ల దీర్ఘకాల ప్రయోజనాలకు ఆటంకం కలుగుతుందని కూడా తను రాసిన ఓ పుస్తకంలో పేర్కొన్నారు రాజన్. భారత ఆర్ధిక వృద్ధి, ద్రవ్యలోటుపైనా ఆయన రాజన్ ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులు మైనార్టీలను లక్ష్యంగా చేసుకుని ఉద్యోగ సంక్షోభాన్ని కప్పిపుచ్చుకోవాలనుకుంటే శ్రీలంక తరహా పరిస్థితులు తలెత్తుతాయని కూడా ఈ ఏడాది జరిగిన ఓ సదస్సులో ఆయన వ్యాఖ్యానించారు.
కాగా భారత్ జోడో యాత్ర ప్రారంభమై వంద రోజులు పూర్తి అవుతున్న సందర్బంగా శుక్రవారం నాడు జైపూర్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సింగర్ సునిధి చౌహాన్ లైవ్ పర్ఫార్మెన్స్ కచేరీ నిర్వహిస్తున్నట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ చెప్పారు. భారత్ జోడో యాత్ర నిర్వహిస్తున్నందున రాహుల్ గాంధీ పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు దూరంగా ఉన్నారు.
Former RBI Governor Raghuram Rajan joined the Padyatra with Rahul Gandhi today. pic.twitter.com/AnMRmcCVu7
— Ankit Mayank (@mr_mayank) December 14, 2022