CDS: జనరల్ బిపిన్ రావత్ స్థానంలో ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే త్రివిధ దళాధిపతి (సీడీఎస్) గా నియమితులైయ్యారు. తొలి త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ ఈ నెల 8న జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మరణంతో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) పదవి ఖాళీ అయ్యింది. దాన్ని భర్తీ చేసే వరకూ పాత పద్ధతిని కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో గతంలో అమలులో ఉన్న పాత పద్ధతి ప్రకారం చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్మన్ పదవిని నరవాణే తో భర్తీ చేసింది కేంద్ర ప్రభుత్వం. త్రివిధ దళాధిపతుల్లో ఆర్మీ చీఫ్ జనరల్ గా ఉన్న నరవాణే సీనియర్ కావడంతో ఆయనకు బాధ్యతలు అప్పగించారు. సీడీఎస్ పోస్టు ఏర్పాటు చేయకమునుపు త్రివిధ దళాధిపతుల్లో సీనియర్ అయిన అధికారి చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్మన్ గా వ్యవహరించే వారు. ఈ కమిటీలో ఆర్మీ, వాయిసేన, నావికా దళాల అధిపతులు సభ్యులుగా ఉంటారు. కొత్త సీడీఎస్ ఎంపిక పూర్తి అయ్యే వరకూ ఈ పదవిలో నరవాణే కొనసాగుతారు. గురువారం ఆయన సీడీఎస్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు.
సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాఫ్టర్ ఈ నెల 8న తమిళనాడులో ప్రమాదవశాత్తు కుప్పకూలడంతో ఆయనతో సహా 13 మంది మృత్యువాతపడ్డారు. ఆ ఘటనలో తీవ్రంగా గాయపడి ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో అధికారి కూడా నిన్న కన్నుమూశారు.