దేశవ్యాప్తంగా ఇప్పుడు అందరి చూపు కరోనా వ్యాక్సిన్ పైనే. ఈ వ్యాక్సిన్ ఎప్పుడెప్పుడు అందుబాటులోకి వస్తుందా అంటూ ప్రజలు ఎదురు చూస్తున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వచ్చే వారం వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది.
ఆక్స్ఫర్డ్/ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ఎమర్జెన్సీ వాడకానికి కేంద్ర ప్రభుత్వం వచ్చే వారంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల ప్రకారం తెలుస్తోంది. ఒకవేళ ఈ గ్రీన్ సిగ్నల్ దక్కితే దేశంలో అందుబాటులోకి రానున్న తొలి కరోనా వ్యాక్సిన్గా ఈ వ్యాక్సిన్ నిలవనుంది .
ఈ మూడు వ్యాక్సిన్ లు వచ్చేస్తున్నాయి
ఇప్పటివరకు మన దేశంలో ఏ వ్యాక్సిన్కు కూడా ప్రభుత్వం ఇంకా ఆమోదముద్ర వేయలేదు. వివిధ వర్గాల సమాచారం ప్రకారం ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్కు వచ్చే వారంలో ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. అత్యవసర వినియోగానికి దరఖాస్తు చేసుకున్న కోవ్యాక్సిన్కు అనుమతులు ఇవ్వడంపైనా కేంద్ర సర్కార్ సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్కు సంబంధించిన అనుమతులు కోరుతూ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) కేంద్రానికి అదనపు సమాచారాన్ని పంపనుంది. దీనికి కేంద్రం సరేనంటే వ్యాక్సిన్ మార్కెట్లో విడుదలవుతుంది. ఒకవేళ ఇదే జరిగితే బ్రిటిష్ కంపెనీ అయిన ఆక్స్ఫర్డ్/ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తొలి దేశం భారత్ అవుతుంది. అల్ప ఆదాయ దేశాలకు ఈ వ్యాక్సిన్ వరమని నిపుణులు చెబుతున్నారు. తక్కువ ధర, సులువైన రవాణా, సాధారణ ఫ్రిడ్జ్ ఉష్ణోగ్రతలో చాన్నాళ్ల వరకు నిల్వ ఉంచుకునే అవకాశం ఉండటంతో ఈ వ్యాక్సిన్ వైపు ఎక్కువ దేశాలు మొగ్గు చూపుతున్నాయి. ఫైజర్ కంపెనీతోపాటు స్థానిక సంస్థ అయిన భారత్ బయోటెక్ తయారు చేసిన కోవ్యాక్సిన్కు అనుమతులు ఇవ్వడం పైనా కేంద్రం సమాలోచనలు చేస్తోంది. మొత్తంగా జనవరిలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం ఖాయం.
రాజకీయ విమర్శలు…
ఇదిలా ఉండగా కరోనా వ్యాక్సిన్ కేంద్రంగా రాజకీయ విమర్శలు జరుగుతున్నాయి. కరోనా వ్యాక్సిన్ త్వరగా అందుబాటులోకి తీసుకురావడంలో ప్రధాని మోడీ విఫలమయ్యారని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఇతర దేశాల్లో వ్యాక్సిన్ పంపిణీ కూడా మొదలైందని.. మన దేశంలో మాత్రం ఇంకా అందుబాటులోకి రాలేదని విమర్శించారు. ‘ప్రపంచంలో సుమారు 23 లక్షల మంది ప్రజలు కరోనా వ్యాక్సినేషన్ చేయించుకున్నారు. చైనా, అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, రష్యాల్లో వ్యాక్సిన్ పంపిణీ మొదలైంది. మరి భారత్లో ఎప్పుడు ప్రారంభిస్తారు మోడీ జీ?’ అని రాహుల్ ట్వీట్ చేశారు.