Gujarat Election 2022: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సొంత రాష్ట్రమైన గుజరాత్ లో తొలి దశ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిసాయి. యువతీ యువకుల నుండి వృద్ధుల వరకూ తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉత్సాహాన్ని చూపారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారు సైతం కుటుంబ సభ్యులతో వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
తాపీ జిల్లాలో ప్రపుల్ భాయ్ మోరే అనే వధువు పెళ్లి దుస్తుల్లోనే పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆ యువకుడు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటింగ్ లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. తాను ఉదయం జరగాల్సిన వివాహాన్ని ఓటింగ్ కోసం సాయంత్రానికి మార్చుకున్నట్లుగా చెప్పారు. అదే విధంగా సూరత్ అసెంబ్లీ నియోజకవర్గంలోనూ హిరేన్ పాండ్య అనే యువకుడు సైతం పెళ్లి బట్టలతోనే పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత నేరుగా పెళ్లి మండపానికి వెెళ్లాడు. వల్పాద్ జిల్లా ఉంబర్ గావ్ నియోజకవర్గంలో శాతాధిక వృద్ధ ఓటర్లు కముబెన్ పటేల్, రాంజీ భాయ్ లు పోలింగ్ కేంద్రానికి చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
సౌరాష్ట్ర – కచ్ రీజియన్, దక్షిణ ప్రాంతంలోని 19 జిల్లాల పరిధిలోని 89 స్థానాలకు నేడు ఓటింగ్ పూర్తి అయ్యింది. గత 27 సంవత్సరాలుగా గుజరాత్ లో అధికారంలో ఉన్న బీజేపీ మరో సారి ఘన విజయం సాధించి అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలని భావిస్తున్నది. ఢిల్లీ, పంజాబ్ మార్క్ చూపి అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు అమ్ అద్మీ పార్టీ గుజరాత్ ఎన్నికల రంగంలోకి వచ్చింది. ఎప్పుడు బీజేపీ, కాంగ్రెస్ మధ్య ద్విముఖ పోటీ ఉండగా, ఈ సారి ఆప్ ప్రవేశంతో త్రిముఖ పోటీ నెలకొంది. ఆప్ ఓటర్లను ఆకట్టుకునేందుకు పెద్ద ఎత్తున ఉచిత హామీలను ఇచ్చింది.