Himachal Pradesh: దేశ వ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికలు కమలనాధులకు కలిసి రాలేదు. దేశ వ్యాప్తంగా 29 అసెంబ్లీ, మూడు పార్లమెంట్ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే ఒక్క పార్లమెంట్, ఏడు అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే బీజేపీ గెలుచుకున్నది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ సత్తా చాటింది. పశ్చిమ బెంగాల్ లో పోటీ చేసిన నాలుగు స్థానాల్లో మూడింటిలో డిపాజిట్ కూడా తెచ్చుకోలేకపోయింది. గతంలో ఉన్న రెండు స్థానాలను కూడా బీజేపీ కోల్పోయింది.
Himachal Pradesh: కార్గిల్ వార్ హీరోకి పరాజయాన్ని పరిచయం చేసిన బీజేపి
ఇక బీజేపీ పాలిత రాష్ట్రం హిమాచల్ప్రదేశ్ లో ఆ పార్టీకి ఎప్పుడూలేనంత గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలోని మండి లోక్ సభ స్థానంతో పాటు ఫతేపూర్ సిక్రీ, ఆర్కి, జుబ్బల్ – కొతెకై అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొందింది. కార్గిల్ వార్ హీరోకి బీజేపీ ఈ రాష్ట్రంలో ఓటమిని పరిచయం చేసింది. రాష్ట్రానికి ఆరు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన వీరభద్రసింగ్ భార్య ప్రతిభా సింగ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా మండి పార్లమెంట్ నుండి బరిలో నిలవగా కార్గిల్ వార్ హీరో బ్రిగేడియర్ (రిటైర్డ్) కుశాల్ చంద్ ఠాకూర్ ను బీజేపీ రంగంలోకి దింపింది. వీరభద్రసింగ్ మరణం తర్వాత ఆ కుటుంబం నుండి ఓ వ్యక్తి పోటీ చేయడం ఇదే ప్రధమం. దీంతో ప్రతిభా సింగ్.. బీజేపీ అభ్యర్ధి కుశాల్ చంద్ పై 8 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ పార్లమెంట్ స్థానంతో పాటు మూడు అసెంబ్లీ స్థానాల్లోనూ కాంగ్రెస్ విజయం సాధించింది.
ఓటమికి కారణం ద్రవ్యోల్బణం సమస్య
జుబ్బల్ – కోటెకై స్థానం నుండి రోహిత్ ఠాకూర్ 6వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యతతో బీజేపీ అభ్యర్ధిగా విజయం సాధించగా, ఆర్కి అసెంబ్లీ స్థానం నుండి సంజయ్ అవస్థి 3,277 ఓట్ల మెజార్టీతో గెలిచారు. అదే విధంగా ఫతేపూర్ సిక్రి అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధి భవానీ సింగ్ 5,652 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. రాష్ట్రంలో జరిగిన ఒక పార్లమెంట్, మూడు అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ పరాజయం పాలవ్వడంపై రాష్ట్ర ముఖ్యముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్ స్పందిస్తూ పలు కారణాలు వెల్లడించారు. పార్టీ ఓటమికి ద్రవ్యోల్బణం సమస్య ఒక కారణంగా అని పేర్కొన్న ఆయన పార్టీ అభ్యర్ధులకు వ్యతిరేకంగా కొందరు బీజేపీ కార్యకర్తలు పని చేశారన్న ఆరోపణలు ఉన్నాయనీ, వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రజా తీర్పును గౌరవిస్తామన్నారు. పార్టీ అభ్యర్ధుల ఓటమిపై ఆత్మపరిశీలన చేసుకుంటామని వెల్లడించారు.