Virabhadra Singh: హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత వీరభద్ర సింగ్ (87) ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కళాశాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం ఆయనకు గుండె పోటు రావడంతో ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు.
కాగా వీరభద్ర సింగ్ రెండు నెలల వ్యవధిలో రెండు సార్లు కరోనా బారినపడ్డారు. ఈ సంవత్సరం ఏప్రిల్ 12 ఆయన తొలి సారి కరోనా బారిన పడ్డారు. దీంతో ఆయనను ఛండీగఢ్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ఆ తరువాత కోలుకుని ఏప్రిల్ 30న ఇంటికి చేరుకున్నారు. అయితే ఇంటికి వచ్చిన కొద్ది గంటల తరువాత ఆయనకు గుండె పోటు రావడంతో సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటి నుండి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా గత నెల 11న మరో సారి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.
హిమాచల్ప్రదేశ్ రాష్ట్రానికి ఆరు సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించి వీరభద్ర సింగ్ రికార్డు సృష్టించారు. 1960లో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా, అయిదు పర్యాయాలు ఎంపిగా గెలిచారు. వీరభద్ర సింగ్ సతీమణి ప్రతిభా సింగ్, కుమారుడు విక్రమాదిత్య సింగ్ కూడా రాజకీయ నాయకులే. ప్రతిభ సింగ్ గతంలో ఎంపిగా పని చేయగా, కుమారుడు విక్రమాదిత్య సిమ్లా రూరల్ నుండి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు.
వీరభద్ర సింగ్ మృతి పట్ల రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సహా పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.