భారత సైనిక రహస్యాలను తెలుసుకునేందుకు పాకిస్థాన్ తరచుగా హనీ ట్రాప్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్న సంగతి తెలిసిందే. యువతులను రంగంలోకి దింపి బలహీనతలు ఉండే అధికారులపై వలపు వల విసిరి భారత సైనిక రహస్యాలను గతంలో సేకరించిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డీఆర్డీఓ కు చెందిన 59 ఏళ్ల ఓ శాస్త్రవేత్త ఇలానే పాక్ మాయలేడి చేతిలో చిక్కి ఆమెకు సైనిక రహస్యాలు చేరవేశాడు. కానీ అతని వ్యవహారం బయటపడటంతో మహారాష్ట్ర పూణేలోని ఉగ్రవాద నిరోధక బృందం ఆయనను అరెస్టు చేసింది. ఎంతో నిజాయితీ, నిబద్దతతో పని చేసిన ఆ సైంటిస్టు సైతం హానీ ట్రాప్ లో పడటం సహచర సైంటిస్టులను ఆశ్చర్యానికి గురి చేసింది.
డీఆర్డీఓ సీనియర్ శాస్త్రవేత్త ప్రదీప్ కురుల్కర్ ఐఎస్ఐ ఏజెంట్ పన్నిన హానీ ట్రాప్ లో చిక్కి .. భారత్ కు సంబంధించిన రహస్య సమచారాన్ని లీక్ చేసినట్లుగా ముంబై ఉగ్ర కార్యకలాపాల నిరోధక దళం (ఈటీఎస్) గుర్తించింది. కొంత కాలంగా ఈ సైంటిస్ట్ వాట్సాప్ ద్వారా పాక్ యువతితో వాయిస్ మెసేజ్ లు, వీడియో కాల్స్ తో కాంటాక్ట్ లో ఉన్నట్లు తెలిసింది. ఓ మిసైల్ కి సంబంధించి ఫోటోను, దాని లోకేషన్ తో పాటు తన పర్సనల్ ఫోటోలను కూడా ఆమెకు పంపాడని వెల్లడైంది. మొదట ఈ సైంటిస్ట్ తో సన్నిహితంగా మాట్లాడుతూ వచ్చిన ఆ పాక్ యువతి ఆ తర్వాత ఆయనను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించిందని తెలుస్తొంది చివరకు డీఆర్డీఓ లోని ఓ అధికారికి అనుమానం వచ్చి ఢిల్లీలో గల విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ కార్యాలయానికి ఫిర్యాదు చేయడంతో ఈ సైంటిస్టును బుధవారం అదుపులోకి తీసుకున్నారు.
అరెస్టు చేసిన శాస్త్రవేత్త ప్రదీప్ కురుల్కర్ ను కోర్టులో హజరుపర్చగా ఈ నెల 9వ తేదీ వరకు ఉగ్రవాద నిరోధక బృందం కస్టడీలో ఉంచాలని సెషన్స్ కోర్టు జడ్జి ఆర్ నవాందర్ ఆదేశించారు. గత ఫిబ్రవరి 24వ తేదీనే ఈ శాస్త్రవేత్త నుండి అధికారులు ల్యాప్ టాప్ ను, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఫొరెన్సిక్ ల్యాబ్ కి పంపగా ఈ శాస్త్రవేత్త సైనిక సమాచారాన్ని పాక్ యువతితో షేర్ చేస్తున్నట్లుగా రుజువు అయ్యింది. ఇది హానీ ట్రాప్ అని స్పష్టంగా తెలుస్తొందని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ విజయ్ ఫర్గాడే అన్నారు. సీనియర్ సైంటిస్ట్ అయిన ప్రదీప్ కురుల్కర్ హానీ ట్రాప్ లో చిక్కుకుని అరెస్టు కావడం సహచరులను దిగ్బాంతికి గురి చేసింది.