Husband Decesed : కరోనా వైరస్ వచ్చి అందరి జీవితాలను చిన్నాభిన్నం చేసింది.. లాక్ డౌన్ ములానా చాలా మంది ఉద్యోగాలు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు.. రోజువారి కూలీలు పని దొరకక ఎన్నో అగచాట్లు పడుతున్నారు.. కుటుంబాలను పోషించుకో లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.. తాజాగా సూర్యాపేట జిల్లా కోదాడలో ఇటువంటి ఘటన చోటు చేసుకుంది.. భార్యకు వీడియో కాల్ చేసి ఒక వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు..
వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్లోని వత్సవాయి మండలం వేమవరం గ్రామానికి చెందిన రుంజా అశోక్ (32) టాటాఎస్ వ్యాన్ డ్రైవర్ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే లాక్ డౌన్ కారణంగా పని దొరక్కపోవడంతో ఇంటి వద్దే ఉంటున్నాడు. భార్య పుట్టిల్లు కాపుగల్లు కావడంతో ఏదైనా పని చేసుకుందామని నెల రోజుల కిందట కోదాడ పట్టణానికి వచ్చి అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. అయితే అక్కడ కూడా పని దొరకకపోవడంతో మద్యానికి బానిసయ్యాడు అశోక్. అద్దె ఇల్లు, కుటుంబ పోషణ భారమవ్వడంతో భార్య, ఇద్దరు కుమార్తెలను ఆమె పుట్టింటికి పంపించేశాడు. తీవ్ర మనస్తాపానికి గురైన అశోక్ శుక్రవారం భార్యకు వీడియో కాల్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పాడు. భార్య వద్దని ఎంత మొత్తుకున్నా వినలేదు. చివరిసారిగా పిల్లల్ని మంచిగా చూసుకోమని చెప్పి, తరువాత గదిలోని ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య ఇంటి దగ్గర నుండి వచ్చేసరికి నిర్జీవుడై ఉన్నాడు. ఘటనపై మృతుడి తండ్రి దావిద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఏఎస్స్ఐ సైదా తెలిపారు.