IIT – Madras: దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యాసంస్థ అయిన ఐఐటీ – మద్రాస్ లో విద్యార్ధుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది. విద్యార్ధుల బలవన్మరణాలు తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. తరచు విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలతో మద్రాస్ ఐఐటీ వార్తల్లో నిలుస్తొంది. తాజాగా మరో విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. మద్రాస్ ఐఐటీలో సెకండ్ ఇయర్ కెమికల్ ఇంజనీరింగ్ కోర్సు చేస్తున్న విద్యార్ధి హాస్టల్ రూమ్ లో ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్ధి ఆత్మహత్యను పోలీసులు దృవీకరించారు. ఈ ఏడాది నాలుగు నెలల కాలంలో ఇది నాల్గవ ఆత్మహత్య. మొత్తంగా 2008 నుండి 12 మంది విద్యార్ధులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
ఈ నెల మొదటి వారంలో పీహెచ్ డీ చేస్తున్న పశ్చిమ బెంగాల్ కు చెందిన 32 ఏళ్ల విద్యార్ధి సచిన్ వేలచ్చేరిలోని తన గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంతకు ముందు గత నెలలో ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం చదువుతున్న ఏపి (కడప)కి చెందిన పుష్పక్ శ్రీసాయి తాను ఉండే హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఫిబ్రవరి 14న మహారాష్ట్రకు చెందిన ఓ రీసెర్చ్ స్కాలర్ ఐఐటీ క్యాంపస్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉన్నత చదువులు పూర్తి చేసుకుని కుటుంబానికి ఆసరా అవుతారని భావిస్తున్న తల్లిదండ్రులకు వారు క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకుని గర్బశోకాన్ని మిగిలిస్తున్నారు.
ఈ ఘటనలను గుణపాఠంగా చేసుకుని విద్యార్ధుల్లో మానసిక స్థైర్యాన్ని పెంపొందించే విధంగా అధ్యాపకులు ట్రైన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.