Breaking: ఢిల్లీ, ముంబాయిలో ఉన్న బీబీసీ కార్యాలయాలపై ఆదాయపన్ను శాఖ (ఐటీ) అధికారులు దాడులు నిర్వహించారు. మంగళవారం ఈ దాడులు జరిగాయి. ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పై బీబీసీ డాక్యుమెంటరీ వివాదం జరుగుతున్న నేపథ్యంలో ఐటీ దాడులు జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సిబ్బంది సెల్ ఫోన్ లను ఐటీ అధికారులు ఆధీనంలోకి తీసుకుని సోదాలు నిర్వహిస్తున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి.
ఢిల్లీ, ముంబాయిలోని బీబీసీ కార్యాలయాల వద్ద బయటి వ్యక్తులు లోపలకు రాకుండా, లోపలి సిబ్బంది బయటకు వెళ్లకుండా పెద్ద ఎత్తున పోలీసులను మోహరించి తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తొంది. అయితే .. ఈ సోదాలపై ఐటీ అధికారులు వివరణ ఇచ్చారు. సర్వే మాత్రమే చేస్తున్నామనీ, సోదాలు చేయట్లేదని తెలిపారు. బీబీసీ కార్యాలయాల్లో ఐటీ అధికారులు సర్వే చేపట్టడం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది.
ఈ దాడుల్లో కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్స్, లాప్ ట్యాప్ లు, కంప్యూటర్ లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లుగా సమాచారం. భారత్ లో బీబీసీ పన్ను ఎగవేసిందన్న కారణాలతోనే ఈ సర్వే చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. భారత్ లో బీబీసీ నిర్వహించే వ్యాపార సంబంధమైన డాక్యుమెంట్ల కోసమే సోదాలు చేస్తున్నామనీ, బీబీసీ ప్రమోటర్లు, డైరెక్టర్ల నివాసాల్లో గానీ మరి ఏ ఇతర ప్రదేశాల జోలికి వెళ్లలేదని అధికారులు పేర్కొన్నారు.
ప్రధాని మోడీ పై బీబీసీ ఇటీవల విడుదల చేసిన డాక్యమెంటరీ తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ డాక్యుమెంటరీ ని భారత్ లో నిషేదించడంపై వివాదం జరుగుతోంది. సుప్రీం కోర్టులో ఈ కేసు విచారణ జరుగుతోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో జరిగిన హింసాత్మక సంఘటనలపై బీబీసీ డాక్యుమెంటరీ రూపొందించింది.
ఏపి లో మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సీఎం వైఎస్ జగన్ .. పర్యాటకులకు గుడ్ న్యూస్