Independence day: దేశ వ్యాప్తంగా 75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ ఎర్రకోటపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జాతీయ జండాను ఆవిష్కరించారు. తొలుత ప్రధాని మోడీ రాజ్ ఘాట్ వద్ద మహత్మాగాంధీ సమాధి వద్ద నివాళులర్పించారు. అనంతరం ఎర్రకోట వద్దకు చేరుకున్న మోడీకి రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్వాగతం పలికారు. ప్రధాని మోడీ త్రివిధ దళాల గౌరవవందనం స్వీకరించారు. వైమానిక దళ హెలికాఫ్టర్లు పూలవర్షం కురిపించాయి. అమరజవానులకు మోడీ నివాళులర్పించారు. అనంతరం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాన మంత్రి మోడీ ప్రసంగించారు. దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
దేశ విభజన గాయం నేటికీ వెంటాడుతూనే ఉందని మోడీ అన్నారు. ధన, మాన, ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ల చేదు జ్ఞాపకాలు వెంటాడుతున్నాయని అన్నారు. సరికొత్త సంకల్పంతో ముందుకు సాగుదామని పిలుపు నిచ్చారు. శతాబ్ధి ఉత్సవాల నాటికి భారత్ ప్రబల శక్తిగా ఎదగాలని ఆక్షాంక్షించారు. వచ్చే 25 సంవత్సరాలు మనకు అమృత ఘడియలు అన్నారు. కరోనా మహమ్మారిపై దేశం యుద్ధం చేస్తుందని అన్నారు. కరోనా కాలంలో ఫ్రంట్ లైన్ వర్కర్స్ అందించిన సేవలు శ్లాఘనీయమని మోడీ పేర్కొన్నారు. దేశంలో 54 కోట్ల మంది వ్యాక్సిన్ లు వేసుకున్నారని చెప్పారు. ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే భారత్ లో మరణాలు తక్కువని మోడీ అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం భారత్ లో జరుగుతోందని అన్నారు. ఒలంపిక్స్ లో మన క్రీడాకారాలు ప్రతిభ కనబరిచారని కొనియాడారు. కరతాళ ధ్వనులతో క్రీడాకారులను ప్రోత్సహిద్దామని ప్రధాని చప్పట్లు కొట్టారు. ఒలింపిక్స్ లో పతకాలు సాధించిన వాళ్లు మనందరికీ స్పూర్తి అన్నారు.
సంక్షేమ, అభివృద్ధి పథకాలు హక్కుదారులకు వంద శాతం చేరాలా చేయాలన్నారు. చిన్న వ్యాపారులు, దుకాణదారులు అందరికీ బ్యాంకులతో అనుసంధానం చేయాలన్నారు. ఇంటింటికీ విద్యుత్, తాగునీరు ఇంకా సుదూర స్పప్నం కాకూడదన్నారు. ప్రతి ఇంటికి విద్యుత్, తాగునీరు అందించడం మనందరికి బాధ్యత అని పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమలులో ఏలాంటి వివక్షతకు తావు ఉండకూడదని అన్నారు. సంపూర్ణ వికాసానికి పోషక లోపం అతి పెద్ద అడ్డంకి అన్నారు. ఏ ఒక్కరు ఈ లోపంతో ఉండకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. రేషన్ షాపుల ద్వారా పోషకాహార ధాన్యాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఒలంపిక్స్ లో పాల్గొన్న 32 మంది క్రీడాకారులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఎర్రకోట వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు.