Indian National Congress: కాంగ్రెస్ పార్టీ వరుస అపజయాలు మూటగట్టుకుంటున్నా మొండిగా ముందుకు వెళుతుందే తప్ప గుణ పాఠాలను నేర్చుకోవడం లేదు. పార్టీలో బలమైన నేతలను దూరం చేసుకోవడం వల్ల వారు ప్రాంతీయ పార్టీలు పెట్టి ఆ పార్టీకే సవాల్ గా నిలుస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ మళ్లీ అధికారం కైవశం చేసుకోవడం కలగానే మిగులుతున్నాయి. శరద్ పవార్, మమతా బెనర్జీ మొదలు కొని ఏపిలో వైఎస్ జగన్మోహనరెడ్డి వరకూ కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చి ప్రాంతీయ పార్టీలు పెట్టి ముఖ్యమంత్రులు అయ్యారు. ఆయా రాష్ట్రాల్లో వీరి ఆధిపత్యమే కొనసాగుతోంది. పంజాబ్ లో ముఖ్యమంత్రి గా బాధ్యత నిర్వహించిన నేతే బయటకు వెళ్లి ఆ పార్టీకి దెబ్బతీసే పరిస్థితి ఉంది. దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత ఇమేజ్ ఉన్న నాయకులను కాంగ్రెస్ పార్టీ కాపాడుకోలేకపోతుందనే మాట వినబడుతోంది. ఇదే క్రమంలో భాగస్వామ్య పక్షాలను సైతం దూరం చేసుకుంటోంది.
Read More: Badvel By Poll: ఈ “మిరాకిల్” జరగొచ్చు..!? ఓటింగ్ శాతమే కీలకం!
Indian National Congress: బీహార్ లో కాంగ్రెస్ రాజకీయం
తాజాగా బీహార్ లో కాంగ్రెస్ పార్టీ తన మిత్రపక్షమైన రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్ జే డీ) ని ఇబ్బంది పెట్టింది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి ఆర్ జే డీ దూరం అయితే ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ తీవ్రంగా నష్టపోవడం ఖాయమనే మాట వినబడుతోంది. బీహర్ లో బలమైన పార్టీగా ఉన్న ఆర్ జే డీ కాంగ్రెస్ కు మిత్ర పక్షంగా ఉంది. లాలూ ప్రసాద్ యాదవ్ కాలం నుండి ఆర్ జే డీ బలమైన పునాదులను ఏర్పరుచుకుంది. గడచిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆర్ జే డీతో కలిసి పోటీ చేసింది. 70 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ కేవలం 20 స్థానాల్లోనే విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో ఆర్ జే డీ అతిపెద్ద పార్టీ గా అవతరించినప్పటకీ కాంగ్రెస్ పార్టీ అతి తక్కువ స్థానాలు కైవశం చేసుకోవడంతో అధికార పీఠాన్ని దక్కించుకోలేకపోయింది. బీహార్ ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ పార్టీని దాని మిత్రపక్షాలు దూరంగా ఉంచుతున్నాయి. తమిళనాడులో స్టాలిన్ కాంగ్రెస్ పార్టీకి పరిమిత స్థానాలను మాత్రమే ఇవ్వడంతో అధికాారాన్ని కైవశం చేసుకోగలిగారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి ఇటువంటి పరిస్థితులు ఏర్పడటం ఆ పార్టీ స్వయంకృతమే అంటున్నారు రాజకీయ పరిశీలకులు.
ఆర్ జే డీని కాదని ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ
ఇంత జరుగుతున్నా ఇప్పుడు బీహార్ లో ఆర్ జేడీ ని దూరం చేసుకునేలా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుండటం ఆశ్చర్యాన్ని కల్గిస్తోంది. బీహార్ లో రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. కుశేశ్వర్ స్థాన్, తారావూర్ స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికలలో ఆర్ జే డీ ని కాదని కాంగ్రెస్ పోటీ చేస్తుంది. కుశేశ్వర్ స్థాన్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని గత ఎన్నికల్లో పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వగా అక్కడ పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి పరాజయం పాలైయ్యారు. దీంతో ఇప్పుడు జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఆర్ జే డీ తమ అభ్యర్ధిని నిలబెట్టింది. తమకు పొత్తులో ఇచ్చిన స్థానంలో బీజేడీ పోటీ చేస్తుందన్న ఆగ్రహంతో కాంగ్రెస్ పార్టీ కుశేశ్వర్ స్థాన్ తో పాటు తారాపూర్ స్థానాలకు తన అభ్యర్ధులను బరిలోకి దింపింది. ఈ పరిణామంతో ఆర్ జే డీతో కాంగ్రెస్ పార్టీ స్నేహానికి గండి పడినట్లు స్పష్టం అవుతోంది,. దీనికి తోడు రాబోయే లోక్ సభ ఎన్నికల్లో 40 స్థానాల్లో పోటీ చేస్తామని బీహార్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు భక్త్ చరణ్ దాస్ ఇప్పుడే ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరో పక్క కాంగ్రెస్ పాార్టీకి స్నేహ హస్తం ఇచ్చి రాబోయే ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల మద్దతుతో కేంద్రంలో అధికారంలోకి తీసుకురావాలని భావించి మంతనాలు జరిపిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆ ప్రతిపాదనలను విరమించుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కేంద్రంలోని బీజేపీ, కాంగ్రెస్ పరిస్థితులపై పీకే ఇటీవల చేసిన కామెంట్స్ కు సంబంధించి ఓ వీడియో వైరల్ కావడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది.