భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) గూఢచర్యం కేసులో మాజీ డీజీపీ సహా ఇతర నిందితులకు సుప్రీం కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. వారి ముందస్తు బెయిల్ రద్దు చేస్తూ సుప్రీం కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. గూఢచర్యం వ్యవహారంలో శాస్త్రవేత్త నంబి నారాయణ్ ను ఇరికించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ డీజీపీ సహా నలుగురు నిందితులకు కేరళ హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్ ను సుప్రీం ధర్మాసనం రద్దు చేసింది. ఈ ముందస్తు బెయిల్ కు సంబంధించి పిటిషన్లపై కేరళ హైకోర్టు మళ్లీ విచారణ జరపాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. ఈ ఉత్తర్వులు ఇచ్చిన నాలుగు వారాల్లోగా వీటిపై తిరిగి విచారణ జరపాలని సూచించింది.
నిందితులకు కేరళ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయగా, హైకోర్టు ఉత్తర్వులను సీబీఐ సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. సీబీఐ దాఖలు అప్పీల్ ను పరిగణలోకి తీసుకున్న జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సీటీ రవి కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం కేరళ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ బెయిల్ ను తోసిపుచ్చింది. ఈ కేసును తిరిగి హైకోర్టుకు నివేదించిన నేపథ్యంలో తన పిటిషన్లను అరెస్టు చేయకుండా రక్షణ కల్పించాలని వారి తరపు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ధర్మాసనాన్ని కోరారు. ఈ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం .. ముందస్తు బెయిల్ దరఖాస్తులపై కేరళ హైకోర్టు తీర్పు వెలువరించే వరకూ నిందితులను అరెస్టు చేయకుండా వారికి రక్షణ కల్పించింది.
ఈ కేసులో కేరళ మాజీ డీజీపీ సీబీ మాథ్యుస్, గుజరాత్ మాజీ పోలీస్ అధికారి ఆర్ బీ శ్రీకుమార్, మాజీ పోలీస్ అధికారులు ఎస్ విజయన్, థంపి ఎస్ దుర్గాదత్, పిఎస్ జయప్రకాశ్ లు ఉన్నారు. ఇస్రోకు సంబంధించి రహస్య డాక్యుమెంట్లను విదేశాలకు బదలాయించడం ద్వారా అప్పటి శాస్త్రవేత్త నంబి నారాయణ్ కుట్రకు పాల్పడ్డారని, గూఢచర్యం చేశారని 1994లో ఆయనపై తప్పుడు అభియోగాలు మోపారు. ఆయనతో పాటు మరో ఇద్దరు సైంటిస్టులు, మాల్దీవులకు చెందిన ఇద్దరు మహిళలపై కూడా నిందితులు ఆరోపణలు చేశారు. ఈ కేసులో నారాయణ్ రెండు నెలల పాటు జైలు శిక్ష అనుభవించారు. అయితే సీబీఐ ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు జరిపి ఆయనపై వచ్చిన అభియోాగాలకు ఆధారాలు లేవని పేర్కొంది. ఈ కేసులో ఆయనను మానసికంగా వేధించారని, చిత్ర హింసలకు గురి చేశారని, అసలు ఆయన అరెస్టుయే అక్రమమని 2018లో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ఆయనకు పరిహారంగా రూ.50లక్షలు చెల్లించాలని కేరళ పోలీసులను ఆదేశించింది.