ISRO : పిఎస్ఎల్వీ – సీ 51 రాకెట్ ప్రయోగం సక్సెస్ అయ్యింది. తొలి సారిగా ఇస్రో చేపట్టిన ప్రైవేటు వాణిజ్య ప్రయోగం విజయవంతం అయ్యింది. మొత్తం 19 ఉప గ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టారు. ఈ ప్రయోగంలో నాలుగు దశల్లో సాగింది. ప్రయోగం సక్సెస్ కావడం పట్ల ఇస్రో శాస్తవేత్తలు ప్రశంసలు అందుకుంటున్నారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరి కోటలోని షార్ కేంద్రంలో ఉన్న ప్రధమ ప్రయోగ వేదిక నుండి పిఎస్ఎల్వీ – సీ 51 ను ప్రయోగించారు. శనివారం ఉదయం 8.54 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభించగా, నేటి ఉదయం (ఆదివారం) 10.24 గంటలకు కౌంట్ డౌన్ జీరో కు చేరుకోగానే పిఎస్ఎల్వీ నింగిలోకి దూసుకువెళ్లింది.
బ్రెజిల్ కు చెందిన 637 కిలోల అమోజోనియ -1 ఉపగ్రహాంతో పాటు ఆమెరికాకు చెందిన 13 ఉపగ్రహాలు, అయిదు దేశీయ ఉపగ్రహాలను నిర్దేశిత కక్షలో వదిలిపెట్టారు. ఇస్రో ఈ ఏడాది చేపట్టిన మొదటి ప్రయోగం ఇది కాగా మొదటి ప్రయోగ వేదిక నుండి 39వ ప్రయోగం. పీఎస్ఎల్వీ డీఎల్ వర్షన్ లో మూడవది. ప్రయోగ నేపథ్యంలో షార్ లో భధ్రతను కట్టుదిట్టం చేశారు. ఈ ప్రయోగాన్ని బ్రెజిల్ దేశ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి మార్కోస్ క్వాంటన్ షార్ కు చేరుకుని ప్రత్యక్షంగా వీక్షించడం గమనార్హం.
అంతరిక్షంలోకి ప్రధాని మోడి ఫోోటో, భగవద్గీత ప్రతి
ఉపగ్రహం ద్వారా అంతరిక్షంలోకి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫోటోను పంపారు. మోడీ పేరు, ఫోోటో, అత్మనిర్భర్ మిషన్ పేరు, భగవద్గీత ప్రతి, వెయ్యి మంది విదేశీయుల పేర్లతో పాటు చెన్నైకి చెందిన విద్యార్థుల పేర్లను అంతరిక్షంలోకి పంపినట్లు ఇస్రో తెలియజేసింది. ప్రయోగం విజయవంతం అవ్వడం పట్ల ఇస్రో చైర్మన్ శివన్ హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో, బ్రెజిల్ అనుసంధానంతో చేపట్టిన తొలి ప్రయోగం గర్వంగా ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బ్రెజిల్ జట్టుకు శివన్ అభినందనలు తెలియజేశారు. దేశీయ, ప్రైవేటు సంస్థలకు చెందిన 19 ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టామని శివన్ సగర్వంగా తెలిపారు.