ఉప రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఎన్డీఏ అభ్యర్ధిని ఖరారు చేసింది. ఎన్డీఏ కూటమి తరపున ఉప రాష్ట్రపతి అభ్యర్ధిత్వం ఎవరిని బరిలోదింపుతారన్న నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న జగదీప్ ధన్ ఖడ్ పేరును ఎన్డీఏ ప్రకటించింది. ఈ మేరకు నేడు జరిగిన బీజేపీ పార్లమెంట్ బోర్డు భేటీలో నిర్ణయం తీసుకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా, పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ సంతోష్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తదితరులు సమావేశంలో ఉప రాష్ట్రపతి అభ్యర్ధిత్వంపై నిర్ణయాన్ని తీసుకున్నారు. సమావేశం అనంతరం ఉప రాష్ట్రపతి ఎన్డీఏ అభ్యర్ధి పేరును పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా ప్రకటించారు.
ఉప రాష్ట్రపతి ఎన్డీఏ అభ్యర్ధి రేసులో జగదీప్ ధన్ ఖడ్ పేరు పేరు ప్రస్తావనకు రానప్పటికీ అనూహ్యంగా ఆయన పేరు బీజేపీ ప్రకటించడం విశేషం. తొలుత మరో మారు వెంకయ్యనాయుడునే కొనసాగిస్తారని వార్తలు వచ్చాయి.ఒక వేళ వెంకయ్య నాయుడుని కొనసాగించని పక్షంలో ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన కేంద్ర మాజీ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నక్వీ, లేదా కేరళ గవర్నర్ అరిఫ్ మహమ్మద్ ఖాన్, లతో పాటు పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీ బెన్ పటేల్, తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ , కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గహ్లాత్ లలో ఒకరికి అవకాశం ఇస్తారని మీడియాలో ప్రచారం జరిగింది. అయితే అనూహ్యంగా జగదీప్ ధన్ ఖడ్ పేరు ను బీజేపీ అదిష్టానం ప్రకటించడం గమనార్హం. ఉప రాష్ట్రపతి ఎన్నిక కు సంబంధించి నామినేషన్ల దాఖలు గడువు మంగళవారంతో ముగియనుండగా అదే రోజు ఎన్డీఏ అభ్యర్ధి నామినేషన్ పత్రాలు సమర్పిస్తారని సమాచారం.