Breaking: భారత 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధనుంజయ యశ్వంత్ చంద్రచూడ్ (డీవై చంద్రచూడ్) ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి, పలువురు కేంద్ర మంత్రులు. సుప్రీం కోర్టు న్యాయమూర్తులు పాల్గొన్నారు. కాగా సుప్రీం కోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ డీవై చంద్రచూడ్ రెండు సంవత్సరాల పాటు అంటే 2024 నవంబర్ 10వ తేదీ వరకూ సేవలు అందించనున్నారు. ఇంతకు ముందు సీజేఐ జస్టిస్ యుయు లలిత్ కేవలం 74 రోజులు మాత్రమే సీజేగా సేవలు అందించారు.
1998 లో అదనపు సోలిసిటర్ జనరల్ గా పని చేసిన జస్టిస్ చంద్రచూడ్ 2016లో సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు ఆయన అలహాబాద్, బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు. దేశంలోనే కీలక కేసులుగా పరిగణించిన అయోధ్య, శబరిమల, సెక్షన్ 377, గర్బ విచ్చిత్తి వంటి కేసుల్లో జస్టిస్ చంద్రచూడ్ కీలక తీర్పులు ఇచ్చారు. 44 సంవత్సరాల క్రితం జస్టిస్ డీవై చంద్రచూడ్ తండ్రి జస్టిస్ యశ్వంత్ విష్ణు చంద్రచూడ్ (వైవీ చంద్రచూడ్) సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందించారు. దాదాపు ఏడు సంవత్సరాల పాటు సీజేఐగా బాధ్యతలు నిర్వహించారు.