Justice NV Ramana: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి న్యాయవ్యవస్థలో తనదైన మార్కు చూపిస్తున్న జస్టిస్ నూతలపాటి వెంకట రమణ (ఎన్వీ రమణ) ఇప్పుడు తాజాగా పార్లమెంటరీ వ్యవస్థపైనే కీలక వ్యాఖ్యలు చేసి సంచలన సృష్టించారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జస్టిస్ ఎన్వీ రమణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరిగిన తీరుపై జస్టిస్ ఎన్వీ రమణ విచారం వ్యక్తం చేశారు. చట్టాలను సరిగ్గా తయారు చేయడం లేదనీ, వాటిపై సరైన చర్చలూ జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఇది అత్యంత దారుణమైన విషయమన్నారు. అర్ధవంతమైన చర్చ లేకుండా చట్టాలను చేయడం వల్ల న్యాయపరమైన చిక్కులు ఏర్పడతాయని స్పష్టం చేశారు.
Read More: AIIMS Chief: పిల్లలపై కరోనా థర్డ్ వేర్ ప్రభావం గురించి ఢిల్లీ ఎయిమ్స్ చీఫ్ ఏమన్నారంటే.
కొత్త చట్టాల అసలు ఉద్దేశం ఏమిటో తెలియకుండా పోతుందని అన్నారు. చట్టాల తయారీలో నాణ్యతాలోపం లిటిగేషన్లకు దారి తీస్తుందన్నారు. కొన్ని చట్టాలను కోర్టులు కూడా సరిగా అర్థం చేసుకోలేక పోతున్నాయని చెప్పారు. చట్టసభల్లో మేధావులు, మరియు న్యాయవాదులు లేకపోతే ఇలాంటి పరిస్థితులు నెలకొంటాయని అభిప్రాయపడ్డారు. దేశ స్వాతంత్ర్యోద్యమం నుండి దేశ తొలి చట్ట సభ ప్రతినిధుల దాకా న్యాయవాదులు ఎనలేని కృషి చేశారని గుర్తు చేసిన జస్టిస్ వెంకట రమణ అనాడు చట్టసభల్లో న్యాయవాదులు ఎక్కువగా ఉండేవారని అన్నారు. దాని వల్ల చర్చలు అర్థవంతంగా, నిర్మాణాత్మకంగా సాగేవని అన్నారు. తీసుకువచ్చే చట్టాలపై సవివరాలతో చర్చ జరిగేదన్నారు.
అయితే కాలం మారుతున్న కొద్దీ మొత్తం మారిపోయిందన్నారు. చర్చల్లో పస ఉండటం లేదని, అసలు ఆ చట్టాల ఉద్దేశం కోర్టులకూ తెలియడం లేదనీ, వాటికి అభ్యంతరం చెప్పే అధికారమూ కోర్టులకు లేకుండా పోయిందని అన్నారు. ఈ పరిస్థితులు మారాటంలే న్యాయవాదులు ఇళ్లకే పరిమితం కాకుండా ప్రజా సేవకూ ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ వంటి మహానుభావులు న్యాయవాదులేనని జస్టిస్ రమణ ఈ సందర్భంగా గుర్తు చేశారు. సీజేఐ ఎన్వీ రమణ వ్యాఖ్యలపై సీనియర్ పార్లమెంటేరియన్ లు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.