Justice NV Ramana: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ బాధ్యతలు చేపట్టి తరువాత న్యాయ వ్యవస్థలో సరికొత్త సంస్కరణలు వచ్చేస్తున్నాయి. ఆ దిశగా జస్టిస్ రమణ కీలక నిర్ణయాలను తీసుకుంటున్నారు. ప్రదానంగా దేశ వ్యవస్థలో మార్పులు జరగాలన్నా, కొత్త చట్టాలను తీసుకురావాలన్నా, పాత చట్టాలను సవరించాలన్నా, వ్యవస్థల ప్రక్షాళన జరగాలన్నా అవి భారత రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, సుప్రీం కోర్టుల వల్లనే సాధ్యమవుతుంది. ఆ విషయం మన అందరికీ తెలుసు. ప్రధాన మంత్రి విషయానికి వస్తే ఓ పక్క రాజకీయ ప్రయోజనాలు, ప్రజా సంక్షేమం రెండు ఆలోచనలతో నిర్ణయాలను తీసుకుంటారు. ఇక రాష్ట్రపతి లోక్సభ, రాజ్యసభ తీర్మానాలకు అనుగుణంగా వెళుతుంటారు. ఈ రెండింటి నిర్ణయాలలో ఏమైనా లోపాలు ఉంటే వాటిని సరిచేసే విధంగా ఆదేశాలు ఇచ్చేది న్యాయవ్యవస్థ. ఇటువంటి కీలక వ్యవస్థకు అధిపతిగా బాధ్యతలు చేపట్టిన ఏపికి చెందిన జస్టిస్ రమణ చేపడుతున్న సంస్కరణలు భవిష్యత్తు తరాలకు శాశ్వతంగా గుర్తుండిపోయే విధంగా ఉన్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు.
Read More: Supreme Court: ఇకపై బెయిల్ మంజూరైన క్షణాల్లోనే రిలీజ్..! జస్టిస్ ఎన్వీ రమణ ‘ఫాస్టర్’..!!
అందులో ప్రధానంగా ఐటి యాక్ట్ 66 ఏ కేసులు, రాజద్రోహం కేసులు, బెయిల్ మంజూరైన ఖైదీల విడుదల అంశాలపై కీలక నిర్ణయాలను వెల్లడించారు. ఈ మూడు నిర్ణయాలు దేశ దిశ మార్చబోతున్నాయి. ఐటీ యాక్ట్ 66 ఏ కింద కేసుల నమోదు రాజ్యాంగ వ్యతిరేకమని పేర్కొంటూ 2015లోనే దాన్ని సుప్రీం కోర్టు దాన్ని రద్దు చేస్తే ఆ తరువాత కూడా కేసులు నమోదు చేస్తుండటంపై జస్టిస్ ఎన్వీ రమణ సీరియస్ కావడంతో కేంద్ర హోంశాఖ ఆ సెక్షన్ కింద నమోదు అయిన కేసులు అన్నీ రద్దు చేయాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. ఆ సెక్షన్ కింద కేసులు నమోదు చేయవద్దని కూడా రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు ఇచ్చింది. ఆ తరువాత ఇటీవల రాజద్రోహం (సెక్షన్ 124(ఎ)) కేసుల నమోదుపైనా ఇటీవల జస్టిస్ ఎన్వీ రమణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వలస పాలన అవశేషమైన 124 ఏ సెక్షన్ రాజద్రోహం కేసులు ఇంకా కొనసాగడం ఏమిటని ప్రశ్నించారు. ఇక కోర్టు నుండి బెయిల్ మంజూరైన తరువాత అండర్ ట్రైల్ ఖైదీలు ఒక్క క్షణం కూడా జైలులో ఉండాల్సిన అవసరం లేదనీ, తక్షణం విడుదల చేసేలా ఫాస్టర్ వ్యవస్థను తీసుకువస్తున్నారు. బెయిల్ మంజూరు పత్రాలు అందలేదన్న సాగుతో జైలులో ఖైదీలు రోజుల తరబడి మగ్గిపోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై సూమోటోగా తీసుకుని విచారణ జరిపారు జస్టిస్ వెంకట రమణ.
తాజాగా కోర్టులో జరిగే అంశాలు పారదర్శకంగా ఉండాలన్న భావనతో సుప్రీం కోర్టులో జరిగే వాదనలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటి వరకూ అది లేకపోవడంతో కోర్టులో జరిగిన అంశాలను వివిధ మీడియాలు వారికి ఇష్టాను సారంగా ప్రచురితం చేయడంతో ప్రజలు అయోమయానికి గురి అయ్యే పరిస్థితి ఉంది. సుప్రీం కోర్టులో విచారణలను ప్రత్యక్ష ప్రసారాలు చేయడం వల్ల ఎవరైనా వీక్షించే అవకాశం ఏర్పడుతుంది. ప్రత్యక్ష ప్రసారాల వ్యవస్థ ఆగస్టు 15 నుండి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. న్యాయ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీ తనానికి ఇది దోహదపడుతుంది.