Covid 19 Patients: కర్నాటక సీఎం యడియూరప్పకు కరోనా సోకింది. చికిత్స అనంతరం కోలుకున్నారు. యధావిధిగా పరిపాలనా విధుల్లో పాల్గొంటున్నారు. మరో పక్క రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతండగా, వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో బెడ్స్ కొరత ఒక పక్క, ఆక్సిజన్ కొరత మరో పక్క ఇబ్బందులను కల్గిస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం యడియూరప్ప రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతున్నారు.
సీఎం యడియూరప్ప శివాజీనగర్ లోని కోవిడ్ కేర్ సెంటర్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంలో కోవిడ్ కేర్ సెంటర్ లో ఉన్న వారి వివరాలను చూడటంతో ఆయనకు కోపం చిర్రెత్తుకొచ్చింది. పేషంట్స్ ను చూసి ఆయనకు కోపం రావడం ఏమిటని అనుకుంటున్నారా అలా అనుకుంటే పప్పులో కాలేసినట్లే. విషయం ఏమిటంటే అందులో ఉన్న వారు అందరూ అస్వస్థత, లేక అనారోగ్యంతో బాధపడుతున్నా వారు
కాదు. మొత్తం 503 మంది 20 రోజులకు పైగా ఆసుపత్రి ఉండి కోలుకున్నారు. వీరిలో 332 మంది నెల రోజులుగా ఉన్నారు. పూర్తిగా ఆరోగ్యం కుదుటపడినా వీరు ఇళ్లకు వెళ్లకుండా బెడ్లకు అంటి పెట్టుకొని ఉండి హాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో వారిపై యడియూరప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవిడ్ నుండి కోలుకున్నవారందరినీ డిశ్చార్జ్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఓ వైపు బెడ్ల కొరత ఉందనీ, కోలుకున్న వారు అందరూ వెంటనే ఆసుపత్రి నుండి ఇళ్లకు వెళ్లిపోవాలని యడియూరప్ప సూచించారు. వ్యాక్సిన్ వచ్చిన వెంటనే అందరికీ వేయిస్తామని, గందరగోళం సృష్టించకుండా ఇళ్లకు వెళ్లిపోవాలని విజ్ఞప్తి చేశారు. మరో పక్క కోవిడ్ వార్ రూమ్ సిబ్బంది అందిస్తున్న వైద్య సేవలను యడియూరప్ప ప్రశంసించారు.