Karnataka: కర్నాటకలో గత కొద్ది నెలలుగా ముఖ్యమంత్రి మార్పు అంశంపై ఊహాగానాలు సాగుతూనే ఉన్నాయి. ఈ వార్తలను ముఖ్యమంత్రి యెడియూరప్ప కొట్టిపారేస్తూనే ఉన్నారు. అయితే రెండు రోజుల హస్తిన పర్యటన ముగించుకుని శనివారం బెంగళూరు విచ్చేసిన సీఎం యెడియూరప్ప ఈ నెల 26వ తేదీ బీజేపీఎల్పీ సమావేశం అవుతున్నట్లు ప్రకటించారు. దీంతో కేంద్ర బీజేపీ కమిటీ ఆయనను ముఖ్యమంత్రి నుండి తప్పుకోమని చెప్పిందనీ, ఆయన ఈ నెల 26వ తేదీన రాజీనామా చేస్తారనీ, కొత్త నేతను ఎల్పీ సమావేశంలో ఎన్నుకుంటారని ఊహాగానాలు సాగుతున్నాయి. అయితే సీఎం యెడియూరప్ప మాత్రం తన ఢిల్లీ పర్యటన విజయవంతం అయ్యిందనీ చెప్పుకొచ్చారు. కేంద్ర నాయకులు తనను సీఎంగా కొనసాగాలని సూచించారనీ, రాష్ట్రంలో పార్టీ మరింత బలోపేతానికి కృషి చేయాలని తెలియజేశారని పేర్కొన్నారు. నాయకత్వ మార్పు అంశంపై ఎటువంటి చర్చ జరగలేదన్నారు.
Read More: Amith Shah: సరిహద్దు భద్రతా వ్యవస్థపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
సీఎం యడియూరప్ప తన ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ, రక్షణ శాఖ మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డాలతో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి మార్పు అంశంపై ఊహాగానాలు జరుగుతున్న వేళ సీఎం యెడ్యూరప్ప ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సీఎం పదవి నుండి తప్పుకోవడానికి యెడియూరప్ప కేంద్ర నాయకత్వం వద్ద కొన్ని షరతులు పెట్టారాని అంటున్నారు. తన ఇద్దరు కుమారులకు బీజెపీ జాతీయ కార్యవర్గంలోకి తీసుకుని కీలకమైన పాత్ర పోషించేలా పార్టీ సహకరిస్తే సీఎం పదవికి రాజీనామా చేయడానికి సిద్దంగా ఉన్నానని చెప్పినట్లు కూడా వార్తలు వచ్చాయి.
అయితే యడియూరప్ప మాత్రం తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతాననీ, తనను పదవి నుండి వైదొలగమని ఎవరూ కోరలేదని అంటున్నారు. రాజీనామాకు సంబంధించిన వార్తలన్నీ వదంతులేనని ఆయన కొట్టిపారేస్తున్నారు. కర్నాటకలో ప్రాజెక్టులపై చర్చించేందుకే ఢిల్లీ పెద్దలను కలిశాననీ, వచ్చే నెలలో కూడా మరో సారి ఢిల్లీకి వెళతానని యెడియూరప్ప పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఊహాగానాలు వాస్తవమో కాదో అనేది తేలాలంటే ఈ నెల 26వ తేదీన జరిగే బీజేపీ ఎల్పీ సమావేశం వరకూ వేచి చూడాల్సిందే.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?