Karnataka: గత నాలుగు రోజులుగా ఉత్కంఠ రేపుతున్న కర్ణాటక ముఖ్యమంత్రి అభ్యర్ధి వ్యవహారానికి పరిష్కారం కుదిరినట్లు తెలుస్తొంది. కర్ణాటక ప్రభుత్వ ఏర్పాటుపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. పార్టీ అధినేతల ఒత్తిడితో కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఒక మెట్టు దిగారు. అధిష్టానం సూచనకు ఒకే చెప్పినట్లుగా తెలుస్తొంది. అందరూ ఊహించినట్లుగానే మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నేత సిద్ద రామయ్య మరో సారి కర్ణాటక సీఎం పీఠాన్ని అధిష్టించబోతున్నారు. అయితే సీఎం పదవికి మొదటి నుండి పట్టుబట్టిన డీకే శివకుమార్ డిప్యూటి సీఎంగా బాధ్యతలు తీసుకోబోతున్నారు. దీనిపై పార్టీ అధిష్టానం నేడు అధికారికంగా ప్రకటన విడుదల చేయనున్నది.
బుధవారం పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. తొలుత చెరోక రెండున్నరేళ్లు సీఎం పదవిలో ఉంటారనీ, తర్వాత సిద్ద రామయ్యే పూర్తి కాలం సీఎంగా ఉంటారని ప్రచారాలు సాగాయి. సిద్దా రామయ్య కాబోయే ముఖ్యమంత్రి అంటూ మీడియాలో వార్తలు రావడంతో ఏఐసీసీ కర్ణాటక ఇన్ చార్జి రణ్ దీప్ సుర్జేవాలా సీరియస్ అయ్యారు. తప్పుడు వార్తలు ప్రసారాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో బుధవారం రాత్రి నుండి గురువారం తెల్లవారుజాము వరకూ పార్టీ అధిష్టానం తీవ్ర మంతనాలు జరిపింది.
చివరకు ఇలా..
మొదటి రెండేళ్ల పాటు సిద్దా రామయ్య సీఎంగా ఉంటారు. డిప్యూటి సీఎం గా డీకే శివకుమార్ బాధ్యతలు చేపడతారు. ఆ తర్వాత మూడేళ్ల డీకే శివకుమార్ కు ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించనున్నారు. ప్రస్తుతం డీకే శివకుమార్ కు డీప్యూటి సీఎం పదవితో పాటు డీకే కోరిన మంత్రిత్వ శాఖలు ఆయన వర్గం నేతలకు ఇచ్చే ఒప్పందానికి అంగీకరించినట్లు తెలుస్తొంది. మరో వైపు ఇవేళ రాత్రి ఏడు గంటలకు కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. అనంతరం సిద్దారామయ్య, డీకే శివకుమార్ గవర్నర్ ను కలవనున్నారు.
20వ తేదీ ప్రమాణ స్వీకారం
ఇక ఈ నెల 20వ తేదీ (శనివారం) మధ్యాహ్నం 12.30 గంటలకు సిద్దా రామయ్య సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో కాంగ్రెస్ అధిష్టానం సమక్షంలో ఈ ప్రమాణ స్వీకారం జరగనున్నది. పలు రాష్ట్రాల సీఎంలు సైతం హజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి వివిధ రాజకీయ పక్షాల అగ్రనేతలను ఆహ్వానించడం ద్వారా విపక్షాల ఐక్యతను చాటాలని కాంగ్రెస్ భావిస్తున్నది.
మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు 14 రోజుల రిమాండ్ .. కర్నూలు జైలుకు తరలింపు