Karnataka Congress: కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. మ్యాజిక్ ఫిగర్ కు మించి 23 స్థానాలు కైవశం చేసుకుంది కాంగ్రెస్. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సీఎంగా ఎవరిని ఎంపిక చేస్తుంది అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎందు కంటే సీఎం పదవి రేసులో సీనియర్ నేత సిద్దారామయ్య, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఉండటంతో ఎవరికి ఆ పదవి వరిస్తుంది అనే దానిపై చర్చ జరుగుతోంది.
ఎన్నికల సమయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ తమ సీఎం అభ్యర్ధి ఎవరు అనేది ప్రకటించకుండా హిమాచల్ ప్రదేశ్ లో అనుసరించిన విధానాన్నే అమలు చేసింది. కలిసి కట్టుగా పని చేయాలని, గెలిచిన తర్వాత సీఎం ను ఎంపిక చేద్దామని పార్టీ అధిష్టానం చెప్పడంతో సిద్దారామయ్య, డీకే శివకుమార్ లు విభేదాలు పక్కన పెట్టి పార్టీ విజయం కోసం కృషి చేశారు. వారి శ్రమ, కృషికి ఫలితం లభించింది. అయితే ఇప్పుడు సీఎం విషయంలో పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠగా మారింది. హిమాచల్ ప్రదేశ్ లో ముగ్గురు నేతలు ముఖ్యమంత్రి పదవికి పోటీ పడగా, ఫలితాల తర్వాత ముగ్గురిని కుర్చోబెట్టిన అధిష్టానం ఎటువంటి తగవులు, అసమ్మతి తలెత్తకుండా సీఎం అభ్యర్ధిని ఎంపిక చేసింది. అయితే ఇక్కడ ఇద్దరు నేతల మధ్యే పోటీ నెలకొనడంతో వారి ఇద్దరి మధ్య ఎలా రాజీ చేస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.
కర్ణాటకలో మాస్ లీడర్ గా పేరున్న నాయకుల్లో యడ్యూరప్ప తర్వాత ఉన్న నేత సిద్దారామయ్య. సిద్దా రామయ్యకు అదే పెద్ద ప్లస్ పాయింట్. వివిధ సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్, ఓపీనియన్ పోల్స్ లో మెజార్టీ కన్నడ ఓటర్లు సీఎం అభ్యర్ధిగా సిద్దా రామయ్య పైనే మొగ్గు చూపారు. సిద్దా రామయ్యనే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సీఎం పదవికి ఎంపిక చేస్తుందని మెజార్టీ ప్రజల అభిప్రాయంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఈ సారి అధికారంలోకి రావడానికి ప్రదాన కారణం కూడా సిద్దా రామయ్య నాయకత్వంపై చూపిన నమ్మకమేనని అంటున్నారు. మరో పక్క పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ బలమైన నేతగా ఉన్నారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో కర్ణాటక లోని 28 ఎంపీ స్థానాలకు గాను కాంగ్రెస్ గెలుచుకుంది కేవలం ఒక్క స్థానమే. అది కూడా డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేష్. ఎన్ని కేసులు పెట్టినా కాంగ్రెస్ పార్టీ విధేయుడుగా నిలిచి పోరాటం చేయడం డీకే శివకుమార్ కు ప్లస్ పాయింట్ గా ఉంది. 2020లో ఆయనను పీసీసీ అధ్యక్షుడుగా నియమించగా, పార్టీ బలోపేతం కోసం శక్తివంచన లేకుండా కృషి చేశారు. ఈడీ కేసులు నమోదు చేసి జైలులో కూడా పెట్టారు ఆయనను. అయినా పార్టీ కోసం విభేదాలు పక్కన పెట్టి పని చేశారు.
ఆయన జైలులో ఉన్న సమయంలో సోనియా గాంధీ స్వయంగా వెళ్లి పరామర్శించడంతో ఆయనకు పార్టీ ఇచ్చిన ప్రాధాన్యత అర్ధం అవుతోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సొంత రాష్ట్రం కావడంతో ఈ ఇద్దరు నేతల మధ్య ఎటువంటి తేడాలు రాకుండా సీఎంను ఎంపిక బాధ్యత ఆయనపై ఉంది. ముఖ్యమంత్రిని ఎంపిక చేసేందుకు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు బెంగళూరులో రేపు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో పార్టీ అధిష్టాన పరిశీలకులు హజరై అభిప్రాయ సేకరణ చేస్తారు. ఇద్దరు నేతలతో సంప్రదింపులు జరిపి ముఖ్యమంత్రిని ప్రకటించడం గానీ లేక కాంగ్రెస్ సంప్రదాయం ప్రకారం సీఎం ఎంపిక నిర్ణయాధికారం అధిష్టానంకు అప్పగిస్తూ తీర్మానం చేయడం గానీ చేస్తారని భావిస్తున్నారు. లేకపోతే చెరి రెండున్నర సంవత్సరాలు అధికారంలో ఉండేలా ఇద్దరి మద్య సయోధ్య కుదిర్చే అవకాశం కూడా లేకపోలేదని అంటున్నారు. చూడాలి ఏమి జరుగుతుందో.
Basavaraj Bommai: ఓటమిపై సీఎం బసవరాజు బొమ్మై స్పందన ఇది