Karnataka Politics: కర్నాటక అధికార పక్షంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన యడియూరప్ప రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ఈ మేరకు యడియూరప్ప రాజీనామాను గవర్నర్ ఆమోదిస్తూ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరిగే వరకూ ఆపధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని సూచించినట్లు సమాచారం.
అనంతరం యడియూరప్ప మీడియాతో మాట్లాడుతూ రాజీనామా విషయంలో తనపై ఎవరి ఒత్తిడి లేదని తెలిపారు. మరొకరికి అవకాశం కల్పించేందుకు రాజీనామా చేసినట్లు వెల్లడించారు. రాబోయే రోజుల్లో కూడా బీజేపీకి పూర్తి సహకారం అందిస్తానని చెప్పారు. తాను ఎవరి పేరును సీఎం పదవికి సిఫార్సు చేయలేదని యడియూరప్ప తెలిపారు. పార్టీ అధిష్టానం ఎవరి పేరు సూచించినా సహకరిస్తానని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తానని వెల్లడించారు.
Karnataka Politics: సీఎం ఎంపిక పరిశీలకుడిగా ధర్మేంద్ర ప్రధాన్
యడియూరప్ప రాజీనామా చేసిన నేపథ్యంలో నూతన సీఎంని ఎంపికకు పరిశీలకుడుగా పార్టీ అధిష్టానం కేంద్ర మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్ ను నియమించింది. సీఎం రేసులో ప్రహ్లాద్ జోషి, సీటీ రవి, ముర్గేష్ నిరాణి, బసవరాజ్ ఉండగా రేపు జరగనున్న బీజేపీ ఎల్పీ సమావేశంలో సీఎంను ఎంపిక చేయనున్నారు.
ఇదిలా ఉండగా, యడియూరప్ప రాజీనామా సమర్పించిన నేపథ్యంలో పలువురు సీనియర్ మంత్రులు రాజ్ భవన్ బాట పట్టారు. గవర్నర్ ను కలిసేందుకు పలువురు సీనియర్ మంత్రులు రాజ్ భవన్ కు చేరుకోవడం తో తదుపరి సీఎం ఎవరినేది చర్చనీయాంశమయ్యింది. కర్నాటక డిప్యూటి సీఎం లక్ష్మణ్ సావాడి, వ్యవసాయ శాఖ మంత్రి బీసీ పాటిల్, మరో మంత్రి జేసి మధు లు గవర్నర్ ను కలిశారు.