అతను ఓ సాధారణ ఆటో డ్రైవర్..అతని దశ తిరిగింది.. అదృష్టం కలిసి వచ్చి ఒక్కసారిగా కోటీశ్వరుడు అయ్యాడు. అది ఎలా అంటే.. దేశంలో వివిధ రాష్ట్రాలకు మద్యం (ఎక్సైజ్) అమ్మకాలు ప్రధాన ఆదాయ వనరుగా ఉండగా, కేరళ రాష్ట్రంలో మాత్రం లాటరీ టికెట్ల వ్యాపారం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉందనేది అందరికీ తెలిసిందే. ఇదే క్రమంలో కేరళ లాటరీ చరిత్రలో ఈ ఏడాది మొట్ట మొదటి సారిగా ఓనం బంపర్ ఆఫర్ లాటరీని ప్రవేశపెట్టింది. మొదటి ప్రైజ్ గా రూ.25 కోట్లు, రెండవ బహుమతిగా రూ.5 కోట్లు, మూడవ బహుమతిగా పది మందికి కోటి నిర్ణయించింది. కేరళలో ఓనం పండుగను చాలా బాగా జరుపుకుంటారు. ఈ కారణంగా ఓనం బంపర్ లాటరీ టికెట్లు ఈ ఏడాది 67 లక్షలు ముద్రించారు. టికెట్ ధర రూ.500లుగా నిర్ణయించగా మొత్తం అమ్ముడయ్యాయి.
తిరువనంతపురంలోని శ్రీవరాహం ప్రాంతానికి చెందిన అనూప్ అనే ఆటో డ్రైవర్ అనూప్ లాటరీ ద్వారా తనకు ఎప్పటికైనా అదృష్టం కలిసి వస్తుందన్న ఆశ తో 28 సంవత్సరాలుగా లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తున్నాడు. ఇతను ఆటో డ్రైవర్ గా జీవనం ప్రారంభించక ముందు వంటల్లో ప్రావీణ్యం ఉండటం వల్ల చెఫ్ గా పని చేశాడు. అందుకే మలేషియా వెళ్లి అక్కడ చెఫ్ గా పని చేయాలని నిర్ణయించుకుని రీసెంట్ గా బ్యాంక్ రుణం కోసం అప్లై చేసుకున్నాడు. రూ.3లక్షల రుణం మంజూరు అయ్యింది. ఇక మలేషియా వెళుతున్నాను కదా చివరి సారిగా అదృష్టం పరీక్షంచుకుందామని శనివారం రాత్రి భాగవతి ఏజెన్సీ నుండి ఓ లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. ఎందుకో ఆ టికెట్ నచ్చక మరో టికెట్ తీసుకున్నాడు. ఇప్పుడు ఆ టికెట్ యే ఆయన జీవితాన్ని మార్చేసింది.
కేరళ ఆర్ధిక మంత్రి కేఎన్ బాలగోపాల్ ఆదివారం మధ్యాహ్నం రవాణా శాఖ మంత్రి ఆంటోని రాజు , వట్టియార్కపు ఎమ్మెల్యే వికే ప్రశాంత్ సమక్షంలో ఓనం లక్కీ డ్రా తీశారు. దీనిలో ఆటో డ్రైవర్ అనూప్ కొనుగోలు చేసిన టీజే 750605 టికెట్ మొదటి బహుమతి గెలుచుకుంది. రూ.25 లక్షల జాక్ పాట్ కొట్టిన ఆటో డ్రైవర్ అనూప్ కు పన్ను మినహాయింపులు పోను రూ.15 కోట్ల 75 లక్షల రూపాయలు చేతికి అందనున్నాయి. బంపర్ లాటరీ దక్కడంతో అనూప్ కుటుంబం సంతోషం వ్యక్తం చేస్తొంది. ఈ సందర్భంగా లాటరీ విజేత అనూప్ మీడియా తో మాట్లాడుతూ బతుకు తెరువు కోసం దేశం విడిచి మలేషియా వెళ్లిపోవాలన్న తన ఆకాంక్షను విరమించుకుంటున్నట్లు చెప్పారు. లాటరీ ద్వారా వచ్చిన డబ్బుతో అప్పులు అన్నీ తీర్చేసి మంచి ఇల్లు కట్టుకుంటానని చెప్పారు. ఇక్కడే ఉండి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నబంధువులకు సాయం చేస్తానని తెలిపారు.