భారత్ లో కరోనా టీకాల పంపిణీ పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన వెలువరించనున్నది. భారత ఔషద నియంత్రణ సంస్థ (డీసీజీఐ) ఇవాళ కోవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాల అత్యవసర అనుమతులపై నిర్ణయాన్ని వెల్లడించనున్నది. ఇప్పటికే ఈ రెండు టీకాల అత్యవసర వినియోగానికి కేంద్ర ఔషద ప్రమాణాల నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలోని నిపుణుల బృందం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఆ వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థల చేసుకున్న ధరఖాస్తులను పరిశీలించిన నిపుణుుల కమిటీ మొన్న కోవిషీల్డ్ వ్యాక్సిన్, నిన్న కొవాగ్జిన్ టీకాల అత్యవసర వినియోగానికి సిఫార్సు చేసింది. కోవిషీల్డ్ టీకాను అక్స్ ఫర్డ్ యూనివర్శిటీ, అస్ట్రాజెనెకా భాగస్వామ్యంతో సీరం ఇన్ స్టిట్యూట్ తయారు చేయగా, భారత్ బయోటెక్ సంస్థ కొవాగ్జిన్ టీకాను అభివృద్ధి చేసింది. నిపుణుల కమిటీ సిఫార్సు చేసిన వ్యాక్సిన్ లపై డీసీజీఐ పరిశీలించిన అనంతరం టీకాకు అనుమతులు మంజూరు అవుతాయి. ఆ తరువాత సంబంధిత తయారీ సంస్థలు..మార్కెట్ ఆథరైజేషన్, ఉత్పత్తికి ధరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలన్నీ పూర్తయిన తరువాత మార్కెట్ లోకి టీకా అందుబాటులోకి వస్తుంది.
మరో పక్క దేశంలో వ్యాక్సిన్ పంపిణీకి కేంద్రం శరవేగంగా అడుగులు వేస్తుంది. ఈ క్రమంలో భాగంగా నిన్న దేశ వ్యాప్తంగా టీకా డ్రైరన్ నిర్వహించింది. జూలై నాటికి దేశంలో 30 కోట్ల మందికి వ్యాక్సిన్ అందించాలన్న లక్ష్యంతో భారత ప్రభుత్వం ఉంది.