ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో ఇప్పటికే అరెస్టు అయిన అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్ లకు సీబీఐ కోర్టు ఈ రోజు బెయిల్ మంజూరు చేసింది. ఒకొక్కరికి రూ.2లక్షల పూచికత్తు పై ఏసీబీ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఇదే క్రమంలో ఈడీ దాఖలు చేసిన పిటిషన్ పై ఇద్దరు నిందితులను అయిదు రోజుల ఈడీ కస్టడీకి అనుమతి ఇస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మనీలాండరింగ్ ఆరోపణలపై విచారణ కోసం ఈడీ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. ఈడీ కస్టడీలో ఉన్న సమయంలో నిందితులను కుటుంబ సభ్యులు కలిసేందుకు అవకాశం కల్పించింది ప్రత్యేక కోర్టు. దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం అయిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లిలను గతంలో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కస్టడీకి తీసుకుని విచారణ జరిపింది.
విజయ్ నాయర్ మనీశ్ సిసోడియాకు సహాయకుడు. అమ్ అద్మీ పార్టీ కమ్యూనికేషన్స్ చీఫ్ గా ఉన్నారు. గతంలో నాయర్ ఓ కంపెనీకి సీఈఓగా పని చేశారు. ఇప్పటికే ఈడీ ఇండో స్పిరిట్ ప్రమోటర్ సమీర్, ఫెరన్ోడ్ రికార్డు జీఎం వినయ్ బాబు, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి లను అరెస్టు చేసింది. దాదాపు 169 ప్రదేశాల్లో తనిఖీలను నిర్వహించింది ఈడీ. ఈ కేసులో ఢిల్లీ డిప్యూటి సీఎం మనీశ్ సిసోడియా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయనతో పాటు పలువురు అధికారులపైనా ఆరోపణలు ఉన్నారు.
కాాగా మరో పక్క ఈ కేసులో అప్రూవర్ గా మారిన ప్రముఖ వ్యాపారి దినేశ్ అరోరా స్టేట్ మెంట్ ను కోర్టు రికార్డు చేసింది. దినేశ్ అరోరా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా సన్నిహితుడు. అప్రూవర్ గా మారిన దినేశ్ అరోరాను సాక్షిగా పరిగణించాలని కోరుతూ సీబీఐ కోర్టుకు విన్నవించగా కోర్టు అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు ఇవేళ దినేష్ ఆరోరా స్టేట్ మెంట్ ను రికార్డు చేసింది.