Lakhimpur Kheri violence case: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన లఖింపుర్ ఖేరీ కేసులో నిందితుడుగా ఉన్న కేంద్ర మంత్రి అజయ్ కుమర్ మిశ్రా కుమారుడు అశిశ్ మిశ్రాకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఎనిమిది వారాల పాటు షరతులతో కూడిన బెయిల్ ను సుప్రీం కోర్టు ఇవేళ మంజూరు చేసింది.
2021 అక్టోబర్ 3న ఉత్తరప్రదేశ్ లఖింపుర్ ఖేరీలో సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడి వాహనం రైతుల మీద నుండి దూసుకువెళ్లింది. ఆ సమయంలో అశిశ్ మిశ్రా వాహనంలో ఉన్నారు. ఆ ఘటనలో నలుగురు రైతులు మరణించగా, అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలో మరో నలుగురు మృతి చెందారు. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా అశిశ్ మిశ్ర ను పోలీసులు అరెస్టు చేశారు. లఖింపుర్ ఖేరీ హింస కేసులో అశిశ్ మిశ్రా బెయిల్ పిటిషన్ ను ఉత్తరప్రదేశ్ ప్రబుత్వం వ్యతిరేకించిన నేపథ్యంలో అలహాబాద్ హైకోర్టు అతనికి బెయిల్ నిరాకరించింది. దీంతో అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ అశిశ్ మిశ్రా సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
బెయిల్ పిటిషన్ పై నిందితుడి తరపు న్యాయవాది వాదనలు విన్న జస్టిస్ సుర్యకాంత్, జస్టిస్ మహేశ్వరితో కూడిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ఆ సమయంలో ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. నిందితులను ఎల్లకాలం నిర్బంధించి ఉంచలేమని పేర్కొంది సుప్రీం కోర్టు. ఈ కేసులో అత్యంత దారుణంగా జైలులో మగ్గుతున్న బాధితులు రైతులేననీ, అశిశ్ మిశ్రాకు బెయిల్ మంజూరు చేయకపోతే వారు కూడా కారాగారంలోనే ఉండే అవకాశం ఉందని సుప్రీం కోర్టు తెలిపింది. బుధవారం మధ్యంతర బెయిల్ ను మంజూరు చేస్తూ సుప్రీం ధర్మాసనం తీర్పు వెలువరించింది. అయితే ఈ ఎనిమిది వారాల బెయిల్ పరిధిలో నిందితుడు అశిశ్ .. దేశ రాజధాని ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్ లో ఉండరాదని ధర్మాసనం ఆదేశించింది. అంతే కాకుండా కస్టడీలో ఉన్న ఇతర నిందితులకు కూడా మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన ధర్మాసనం.. విచారణ నివేదికను సమర్పించాలని దిగువ కోర్టును ఆదేశించింది.