Lock Down: దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఢిల్లీ, మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు, అస్సాం, కేరళ, పశ్చిమ బెంగాల్ ఇలా తదితర రాష్ట్రాల్లో లాక్ డౌన్ ఆంక్షలు అమలు చేస్తున్నాయి. దీంతో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో పాటు రికవరీ శాతం కూడా పెరుగుతోంది. వరుసగా నాల్గవ రోజు 4లక్షల లోపు కేసులు నమోదు అయ్యాయి.
ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీలో లాక్ డౌన్ ను మరో వారం రోజుల పాటు పొడిగిస్తూ కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో శనివారం 6430 కోవిడ్ కేసులు నమోదు కాగా అదే సమయంలో 11,591 మంది కరోనా నుండి కోలుకున్నారు. ఈ ఏడాది మార్చి చివరి వారం నుండి ఢిల్లీలో పాజిటివ్ కేసులు పెరుగుతూ వచ్చాయి. రోజుకు 5 వేల మార్కును దాటిన నేపథ్యంలో పరిస్థితులు ప్రమాదకరంగా ఉన్నాయని భావించిన కేజ్రీవాల్ సర్కార్ నివారణ చర్యలు చేపట్టింది. ముందు వీకెండ్ కర్ఫ్యూ, ఆ తరువాత కర్ఫ్యూను వారమంతా అమలు పర్చింది.
అయితే పరిస్థితుల్లో పెద్దగా మార్పు కనబడకపోగా కేసుల సంఖ్య 20 వేల మార్కు దాటింది. ఆ నేపథ్యంలో గత నెల 19వ తేదీన లాక్ డౌన్ విధిస్తున్నట్లు సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. తొలుత లాక్ డౌన్ వారం రోజులు అని తెలిపారు. అయితే లాక్ డౌన్ అమలు సత్ఫలితాలు ఇస్తుండటంతో వారం వారం పొడిగిస్తూ వచ్చారు. కేసుల సంఖ్య గతం మీద తగ్గడంతో ఆసుపత్రుల్లో ఆక్సిజన్ వినియోగం కూడా తగ్గింది. ఈ నేపథ్యంలో మరో వారం రోజులు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేడు ప్రకటించారు.