madras High Court: దేశంలో కరోనా వైరస్ రెండవ దశ ఉదృతమవుతున్న వేళ రాజకీయ పార్టీల ర్యాలీలకు ఎన్నికల సంఘం అనుమతులు ఇవ్వడంపై తమిళనాడు హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సమయంలో తన నియోజకవర్గంలో కరోనా నిబంధనలు పాటించేలా ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఓ ప్రజా ప్రతినిధి దాఖలు చేసిన వినతి పై సోమవారం మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సాంజిబ్ బెనర్జీ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా హైకోర్టు సీజే ఈసీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కరోనా రెండవ దశ విజృంభణకు ఎన్నికల సంఘానిదే బాధ్యత అని పేర్కొంటూ ఎన్నికల అధికారులపై హత్య కేసు నమోదు చేయాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు.
ఎన్నికల ప్రచార సమయంలో కరోనా ఆంక్షలు అమలు చేయడంలో ఈసీ పూర్తిగా విఫలమైందన్నారు. ఎన్నికల ప్రచారాల వేళ ఎన్నికల అధికారులు వేరే గ్రహంలో ఉన్నారా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మే 2న జరిగే కౌంటింగ్ ప్రక్రియలో కరోనా కట్టడికి తీసుకొనబోయే చర్యల ప్రణాళికను కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి, రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శితో కలిసి రూపొందించాలని హైకోర్టు సూచిస్తూ వీటిని ఈ నెల 30వ తేదీ హైకోర్టు ముందు ఉంచాలని ఆదేశించింది. కరోనా కట్టడి చర్యల ప్రణాళికను అందించకపోతే ఓట్ల లెక్కింపు నిలిపివేస్తామని హైకోర్టు హెచ్చరించింది.
ఓ పక్క దేశంలో కరోనా సెకండ్ వేవ్ అంటూ శాస్త్రవేత్తలు హెచ్చరికలు వస్తున్న సమయంలోనే నాలుగు రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, ఒడిశాతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుఛ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. పశ్చిమ బెంగాలలో ఏకంగా 8 దశల్లో ఎన్నికలు జరుపుతోంది, ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీ నేతల ప్రచారం, ర్యాలీల నిర్వహణలో ఎక్కడా భౌతిక దూరం పాటించిన దాఖలాలు లేవు. దీంతో దాదాపు ఎన్నికల జరిగిన ప్రాంతాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరిగాయి.