మహారాష్ట్ర రాయగఢ్ జిల్లాలోని పర్యాటక ప్రాంతమైన హరిహరేశ్వర్ బీచ్ వద్ద ఏకే 47 ఆయుధాలు కల్గిన పడవ కనిపించడం కలకలాన్ని రేపింది. ముంబైకి 190 కిలీ మీటర్ల దూరంలో ఉన్న ఈ బీచ్ లో స్థానికులు అనుమానిత బోటును గుర్తించారు. అందులో ఎలాంటి సిబ్బంది లేకపోవడం, అందులో ఏకే 47 ఆయుధాలు ఉండటంతో భద్రతా ఏజన్సీలకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు బోటు వద్దకు చేరుకున్నారు. రాయఘడ్ ఎస్పీ అశోక్ దుధే, ఇతర సీనియర్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని బోటును తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అందులో ఉన్న మూడు ఏకే 47 ఆయుధాలు, బుల్లెట్లు, అమ్మోనియం ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ముంబాయి తరహా దాడులకు ఉగ్రవాదులు కుట్ర చేస్తున్నారేమో అన్న అనుమానంతో రాయగడ్ ఫోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. హై అలర్ట్ ప్రకటించారు. పడవ ఎక్కడి నుండి వచ్చింది. అందులోని ఆయధాలు ఎవరు పంపారు, పడవలో ఎవరైనా వచ్చారా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. మరో పక్క అనుమానిత బోటు ఘటన పై ప్రత్యేక విచారణ జరిపించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ శిండేని కోరినట్లు రాయగఢ్ ఎమ్మెల్యే అదితి తర్కరే తెలిపారు. గణేష్ చవితి వేడుకలు సమీపిస్తున్న తరుణంలో ఇలాంటి ఘటన వెలుగు చూడటం భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆమె అన్నారు.
ఈ అనుమానిత బోటు అంశంపై రాష్ట్ర హోంశాఖ మంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. ప్రస్తుతానికి ఎలాంటి ఉగ్రవాద కోణం లేదని, దర్యాప్తు కొనసాగుతోందని ఫడ్నవీస్ తెలిపారు. ఈ బోటు ఆస్ట్రేలియా పౌరురాలు హనా లాండర్ గన్ కు చెందినదిగా హోమ్ మంత్రి ఫడ్నవీస్ మీడియా సమావేశంలో తెలిపారు. బోట్ యజమాని భర్త జేమ్స్ హర్బర్ట్ కెప్టెన్ అని చెప్పారు. ఈ బోట్ మస్కట్ మీదుగా యూరప్ వెళుతుండగా సముద్ర ప్రయాణం మధ్యలోనే బోటు ఇంజన్ దెబ్బతిన్నదనీ, అందులో ఉన్న వారిని కొరియాకు చెందిన మరో బోట్ లోని వారు కాపాడారని వివరించారు ఫడ్నవీస్.
సముద్రంలో ఆగిపోయిన ఈ బోటు .. భారీ అలలకు తీరానికి కొట్టుకొచ్చిందని చెప్పారు. త్వరలో పండుగల సీజన్ ఉన్న నేపథ్యంలో పోలీసులు, అధికారులను అప్రమత్తం చేసినట్లు తెలిపారు. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ సైతం దీనిపై దృష్టి సారించిందని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ ఏజన్సీలకు సమాచారం అందించామని హోమ్ మంత్రి ఫడ్నవీస్ చెప్పారు. అవసరమైతే అదనపు బలగాలను రంగంలోకి దింపి తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. పరిణామాలు ఏవైనా తేలికగా తీసుకోమనీ హోం మంత్రి ఫడ్నవీస్ స్పష్టం చేశారు.